పార్లమెంట్ లో ఆర్టీసీ ప్రస్తావన వస్తే: కాంగ్రెస్..బీజేపీ సిద్దం : ఎంపీలకు కేటీఆర్ నిర్దేశం..!
తెలంగాణలో 43 రోజులుగా వివాదంగా మారిన ఆర్టీసీ సమ్మె విషయం పైన లోక్ సభలో ప్రస్తావించటానికి బీజేపీ సిద్దం అవుతోంది. దీంతో..తిప్పి కొట్టటానికి టీఆర్ఎస్ సిద్దం అవుతోంది. అందులో భాగంగా పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహాల పైన పార్టీ ఎంపీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన సమస్యలు..కేంద్రం నుండి రాష్ట్రానికి దక్కాల్సిన ప్రాజెక్టులతో పాటుగా రాజకీయ అంశాలను ఆ భేటీలో ప్రస్తావించారు. ప్రధానంగా టీయస్ఆర్టీసీ సమ్మె పైన లోక్ సభ లో చర్చకు వస్తే ఎంపీలు ముక్తకంఠంతో స్పందించాలని సూచించారు. అదే విధంగా కేంద్రం ఆలోచనలకు అనుగుణంగానే తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందనే విషయం స్పష్టం చేయాలని సూచించారు. ఎంపీలకు ఆయన ఈ అంశం పైన స్పష్టత ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగారు.. సీఎం కేసీఆర్ కనికరిస్తారా ?
ఎంపీలతో కేటీఆర్ సమావేశం..
రాష్ట్రానికి రావాల్సిన నిధులు ..పథకాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని టీఆర్ఎస్ ఎంపీలను ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్.. మంత్రి కె.తారకరామారావు ఆదేశించారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న దాదాపు 30 అంశాలతో కూడిన జాబితాను వారికి అందజేశారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు తమ ఢిల్లీ పర్యటనల్లో ప్రధాని మోదీతోపాటు, కేంద్ర మంత్రులకు ఇచ్చిన విజ్ఞప్తులపై హామీలు లభించినా.. అందులో చాలావరకు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. వాటిని ఫాలోఅప్ చేయాలని సూచించారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీలు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం గట్టిగా పట్టుబట్టాలన్నారు. ఉభయ సభల్లో బిల్లులు, వివిధ అంశాలపై జరిగే చర్చల్లో విస్తృతంగా పాల్గొనాలని, అవసరానికి అనుగుణంగా జీరో అవర్ను వినియోగించుకోవాలని సూచించారు.
ఆర్టీసీ ప్రస్తావన వస్తే..
తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల్లో ఎవరైనా ఆర్టీసీ అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తే.. దీటుగా బదులివ్వాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేటీఆర్ సూచించారు. మోటార్ వెహికల్ యాక్టు-2019 ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోందనే విషయాన్ని స్పష్టం చేయాలన్నారు. ఈ అంశం పార్లమెంటు బయట ప్రస్తావనకు వచ్చినా.. ఎంపీలందరూ ఒకే వాదన వినిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చెప్పిన విషయాలనే ప్రస్తావించాలని, వివాదాలకు తావివ్వొద్దని అన్నారు. విభజన చట్టం ప్రకారం ఆర్టీసీని విభజించకుండా కేంద్రం జాప్యం చేస్తున్న తీరును ప్రశ్నించాలని సూచించారు. అదే విధంగా కాంగ్రెస్..తెలంగాణ నేతలు ఆర్టీసీ సమ్మె విషయంలో సాధారణ ప్రయాణీకుల అంశాలను పరిగణలోకి తీసుకోకుండా.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న విధానాలను ప్రస్తావించాలని నిర్ధేశించారు.
Recommended Video
జేఏసీ దారి కొస్తుందంటూ..
ఆర్టీసీ సమ్మె విషయంలో ఇప్పటికే జేఏసీ ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం డిమాండ్ ను పక్కన పెట్టింది. కోర్టులో విచారణ 18వ తేదీకి వాయిదా పడింది. ప్రయివేటీకరణ నిర్ణయాల ద్వారా జేఏసీ మీద ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. కార్మికుల్లోనూ అసహనం పెరిగిపోతోంది. ఆత్మహత్యలు అటు ప్రభుత్వాన్ని..ఇటు జేఏసీ నేతలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదే సమయంలో.. జేఏసీ ఖచ్చితంగా తమ డిమాండ్ల నుండి వెనక్కు తగ్గుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నెల 18న కోర్టు తీర్పు ద్వారా ఒక స్పష్టత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, చర్చలకు పిలవాలని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం నుండి మాత్రం స్పందన రావటం లేదు. దీంతో..ఇక పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్..బీజేపీ నేతలు ఆర్టీసీ సమ్మె అంశాన్ని లేవనెత్తేందుకు సిద్దమవుతున్నారు.