కూటిమి అభిప్రాయంతో ఏకీభవించిన కేటీఆర్...ఎన్నికల సంఘాన్ని కలవనున్న టీఆర్ఎస్
ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు నేతలు నాయకులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు టీఆర్ఎస్ నేత కేటీఆర్. 11వ తేదీ తర్వాత ప్రభుత్వం తిరిగి టీఆర్ఎస్ ఏర్పాటు చేస్తుందన్నారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ టీఆర్ఎస్ విజయం సాధిస్తాయని చెప్పారు. సర్వేల మాట ఎలాగున్నా ఏకపక్షంగా తాము విజయం సాధించబోతున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నేతల అంచనాలు తలకిందులు కాబోతున్నాయని అన్నారు కేటీఆర్. ప్రజలు ప్రభుత్వ పథకాలకు మద్దతుగా నిలిచారని చెప్పిన కేటీఆర్ దాదాపు 100 స్థానాలు టీఆర్ఎస్ గెలుచుకుటుందని చెప్పారు.
11వ తేదీన ఫలితాలు వెలువడిన వెంటనే విజయోత్సం చేసుకుందామని చెప్పిన కేటీఆర్ కార్యకర్తలు నేతలు నాయకులు చివరి ఓటు లెక్కింపు జరిగే వరకు అప్రమత్తతతో వ్యవహరించాలని చెప్పారు. అవకాశవాద రాజకీయాలకు ప్రజాకూటమి పరాకాష్టగా నిలిచిందని మండిపడ్డారు కేటీఆర్.
లగడపాటి రాజగోపాల్ సర్వే బూటకపు సర్వేలన్నారు. తెలంగాణ దెబ్బకు ఆయన రాజకీయ సన్యాసం తీసుకున్నారని చెప్పిన కేటీఆర్ 11న వెలువడే ఫలితాలతో ఆయన సర్వేల సన్యాసం కూడా తీసుకుంటారని చెప్పారు. ఇక సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఓటువేసిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. ఓట్లు గల్లంతు అయ్యాయన్న ప్రజాకూటమి ఆరోపణలతో కేటీఆర్ ఏకీభవించారు. ఓట్లు కొన్ని గల్లంతయ్యాయని చెప్పిన కేటీఆర్ 2019 ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఎన్నికల సంఘాన్ని కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. ఓట్లు గల్లంతైతే తమకే నష్టం అని చెప్పారు కేటీఆర్. ఇక ఎన్నికల సంఘం చాలా బాగా పనిచేసిందని ఇంత చక్కగా ఎన్నికలను నిర్వహించినందుకు వారికి అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ చెప్పారు.