అసంతృప్తులపై కేటీఆర్ బుజ్జగింపు మంత్రం .. రంగంలోకి ట్రబుల్ షూటర్ కేటీఆర్
మంత్రివర్గ విస్తరణ చేస్తారన్నవార్తల నాటి నుండి టిఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెల్లుబుకుతోంది. తమకు మంత్రివర్గంలో అవకాశం రాలేదని సీనియర్ నాయకులు వరుసగా విమర్శల వర్షం కురిపించారు. ఎంతగా నిరసన గళం వినిపించారో అంతగా మళ్ళీ విధేయతను చూపించారు. అందుకు మంత్రి కేటీఆర్ చక్రం తిప్పారు.
టీఆర్ఎస్ లో ఎందుకీ అసమ్మతి గళాలు .. బుజ్జగింపు డ్రామాలు .. ఉనికి కోసమేనా ?
నిరసన తెలియజేస్తున్న అసంతృప్త నేతలు
ఇక అసమ్మతి నేతలు ఎవరికి వారు తమ ఆవేదన తెలియజేశారు. ధిక్కార స్వరం పినిపించారు . మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఏకంగా సీఎం కేసీఆర్ మాట తప్పారని మండిపడ్డారు. చిన్న చిన్న పదవులు ఇస్తే తను చేసేది లేదని తేల్చి చెప్పారు. ఇక మంత్రి ఈటెల , జాగు రామన్న , రసమయి బాలకిషన్, మాజీమంత్రి తాటికొండ రాజయ్య, గండ్ర వెంకటరమణా రెడ్డి, బాజిరెడ్డి, షకీల్... ఇలా నేతలందరూ తమ అసంతృప్తితో ఉన్నారు. కొందరు బాహాటంగా ఆవేదన వ్యక్తం చేసే పనిలో బిజీగా ఉన్నారు .
రంగంలోకి దిగిన కేటీఆర్
పార్టీలో ఎప్పుడు సమస్యలు తలెత్తినా, అసంతృప్తి చెలరేగినా రంగంలోకి దిగే కేటీఆర్, ఇప్పుడు తాజా అసమ్మతి వ్యవహారంలోనూ ట్రబుల్ షూటర్ గా వ్యవహరిస్తున్నారు. టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇప్పటికే టికెట్ల కేటాయింపులో మద్యవర్తిత్వం చేసి తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మంత్రివర్గ విస్తరణ లోనూ మంత్రులుగా అవకాశం వచ్చిన వారికి కేటీఆర్ స్వయంగా ఫోన్ చేసి పార్టీలో కేసీఆర్ తర్వాత తానేనని అర్థం అయ్యేలా చేశారు.
అసంతృప్త నేతలకు కేటీఆర్ బుజ్జగింపుల మంత్రం
ఇక తాజాగా కేటీఆర్ మంత్రి పదవుల కేటాయింపుల్లో పదవులు దక్కలేదని అసంతృప్తికి గురైన నేతల పై కూడా బుజ్జగింపు మంత్రం వేస్తున్నారు. అసంతృప్తులను బుజ్జగించడానికి కేటీఆర్ రంగంలోకి దిగిన రెండు రోజుల్లోనే నేతలు మారిపోయారు. ఒకరు కాదు ఇద్దరు కాదు అలిగిన అందరూ దారిలోకి వచ్చేశారు. కేసీఆరే తమ నాయకుడని, గులాబీ బాస్ ఏది చెప్తే అదే చేస్తామని, ఆయన దేవుడంటూ చెప్పడం ప్రారంభించారు. ఇక అంతేనా ఏ సమయంలో ఏం చేయాలనేది సీఎం కేసీఆర్ కి బాగా తెలుసని ఆయన ఏది చేసినా కరెక్ట్ గానే ఉంటుందని కితాబిచ్చారు.
అసమ్మతి నేతలను అనుకూలంగా మారుస్తున్న ట్రబుల్ షూటర్ కేటీఆర్
దీంతో ఆశ్చర్యానికి గురికావడం టీఆర్ఎస్ శ్రేణుల వంతయింది. అలిగిన ప్రతి ఒక్కరికి భవిష్యత్తు మీద భరోసా ఇచ్చి ఉంటారని, భవిష్యత్తులో పదవులు ఇస్తామని చెప్పి ఉంటారని అందుకే ఇంతలా మాట మారుస్తున్నారని పార్టీలోని ఇతర నేతలు గుసగుసలాడుతున్నారు. ఏదేమైనా కేసీఆర్ దృష్టిలో పడాలని అసమ్మతి నేతలు గళం విప్పుతుంటే ఆ అసమ్మతి గళాలను తిరిగి అనుకూలంగా మార్చుకోవడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. అందుకే ఈ వ్యవహారంలో కేటీఆర్ బుజ్జగింపుల మంత్రంపై రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతోంది