అమెరికా తర్వాత హైదరాబాద్లోనే: మెడ్ట్రానిక్ కేంద్రం ప్రారంభం, 5వేల మందికి ఉపాధి
హైదరాబాద్: నగరంలోని నానక్రాంగూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ట్రానిక్ వైద్య పరికరాల ఇంజినీరింగ్ కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మెడ్ట్రానిక్.. అమెరికాకు చెందిన ప్రసిద్ధి చెందిన వైద్యపరికరాల తయారీ సంస్థ.

1200 కోట్లతో ప్రపంచ స్థాయి కేంద్రం..
రూ. 1200 కోట్ల పెట్టుబడితో ప్రపంచ స్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్, ఆవిష్కరణల కేంద్రం మెడ్ట్రానిక్ను నెలకొల్పింది. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఇంజినీరింగ్ పట్టభద్రులకు ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా ఏర్పాటైన మెడ్ట్రానిక్ 140 దేశాల్లో వ్యాపార కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా లక్ష మందికి పైగా ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తున్నారు.

మెడ్ట్రానిక్తో 5వేల మందికి ఉపాధి..
ఇప్పటికే హైదరాబాద్లో పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్వహిస్తోంది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే కేంద్రం ద్వారా ప్రారంభంలో 1000 మందికి, ఆ తర్వాత మరో నాలుగువేల మందికి ఉపాధి లభించనుంది. అమెరికా తర్వాత ప్రపంచంలో ఏర్పాటు చేస్తున్న రెండో కేంద్రం ఇదే కావడం గమనార్హం. 2016లో ఆ దేశంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. మెడ్ట్రానిక్ కార్యనిర్వాహక ఛైర్మన్ ఒమర్ ఇస్రాక్తో సమావేశమై పెట్టుబడుల గురించి చర్చించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిగాయి.
అమెరికాతో తర్వాత హైదరాబాద్లోనే మెడ్ట్రానిక్ కేంద్రం..
ఈ క్రమంలోనే తాజాగా, హైదరాబాద్ నగరంలో తన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది మెడ్ట్రానిక్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్లో గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, ఆపిల్ వంటి అగ్రశ్రేణి సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని చెప్పారు. అమెరికా తర్వాత రెండో కేంద్రాన్ని మెడ్ ట్రానిక్ హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉందన్నారు. మెడ్ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రం ఏర్పాటుతో హెల్త్ కేర్ రంగంలో ఇంజినీరింగ్ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.