రాములమ్మ ఎంట్రీ.. గులాబీ, కమలం మధ్య చేయి.. విషయం అదేనా?
హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనేది ఒకప్పటి మాటలా కనిపిస్తోంది. ఇప్పుడు తాజా వ్యవహారమంతా టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే చందంగా తయారైంది. కారు జోరుకు కళ్లెం వేయడానికి కాషాయ దళం సన్నద్ధమైనట్లుగా స్పష్టమవుతోంది. గులాబీ పరిమళం తగ్గించడానికి.. కమలం పువ్వు వికసించడానికి.. ఢిల్లీ బీజేపీ నేతలు పదునైన వ్యూహాలు రచిస్తున్నారనే టాక్ నడుస్తోంది.
ఆ క్రమంలో కాంగ్రెస్ లీడర్ విజయశాంతి అలియాస్ రాములమ్మ చేసిన తాజా వ్యాఖ్యలు చర్చానీయాంశంగా మారాయి. తాను పార్టీ వీడుతాననే వ్యాఖ్యలు గాంధీ భవన్ కుట్రగా అభివర్ణించిన విజయశాంతి.. రెండు రోజులకే బీజేపీకి సపోర్ట్గా మాట్లాడినట్లు కనిపించింది. నడ్డా - కేటీఆర్, మధ్యలో రాములమ్మగా మారిన తాజా ఎపిసోడ్ ప్రాధాన్యత సంతరించుకుంది.
వేడెక్కుతున్న తెలంగాణ రాజకీయం..!
తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు బోలెడంత సమయమున్నా.. ఇప్పటినుంచే పొలిటికల్ వార్ ముదిరినట్లు కనిపిస్తోంది. 2023 నాటి ఎన్నికల కోసం ముందస్తుగానే తెలంగాణపై కన్నేసింది బీజేపీ. ఆ క్రమంలో టీఆర్ఎస్ను ఇరకాటంలో పెట్టేలా పావులు కదుపుతోంది. సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు ఇతర పార్టీల నేతలకు కాషాయం కండువా కప్పేందుకు సన్నద్ధమైంది.
అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు ఢిల్లీ బీజేపీ పెద్దలు. ఆ నేపథ్యంలో ఇటీవల రాష్ట్ర పర్యటనలు ముమ్మరం చేస్తూ హీట్ పుట్టిస్తున్నారు. ఉద్యమ నేపథ్యం నుంచి బలమైన రాజకీయ శక్తిగా తెలంగాణలో పాగా వేసిన టీఆర్ఎస్కు చెక్ పెట్టి బీజేపీని పటిష్టపరిచే ప్రయత్నాలు ఊపందుకున్నట్లు కనిపిస్తోంది.
హైదరాబాద్లో ఏం జరుగుతోంది.. సీపీ ఆ వార్నింగ్ ఇవ్వడంలో ఆంతర్యమేంటి?
నడ్డా - కేటీఆర్, మధ్యలో రాములమ్మ..! ఏంటో కథ..!!
అదలావుంటే ఇటీవల రాష్ట్రానికి వచ్చిన బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆ క్రమంలో నడ్డా ఎవరంటూ.. తెలంగాణ అడ్డాలో మీ నాటకాలు చెల్లవంటూ ఎద్దేవా చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడిన తీరు చర్చానీయాంశమైంది. అయితే ఈ వ్యవహారంపై బీజేపీ నేతలు ఒకరిద్దరు మాత్రమే పెదవి విప్పితే.. అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్ విజయశాంతి కేటీఆర్పై ఫైర్ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయలను కేసీఆర్ ప్రభుత్వం దోచిందన్న నడ్డా వ్యాఖ్యలు అబద్దాలని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని కేటీఆర్ విసిరిన సవాల్పై ఆమె స్పందించారు. ఇంతకు ఇలాంటి సవాల్ చేసే ముందు మీ తండ్రి సీఎం కేసీఆర్ పర్మిషన్ తీసుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిధుల స్వాహాకు సంబంధించి ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని గొంతు చించుకునే ముందు తన తనయుడు కేటీఆర్ అలా ఎందుకు సవాల్ విసిరారో కేసీఆర్ అడిగితే బాగుంటుందని సలహా కూడా ఇచ్చారు రాములమ్మ.
విజయశాంతి ఎంట్రీ పరమార్థం ఏంటో..!
టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ వ్యవహారంలా సాగిన నడ్డా - కేటీఆర్ మాటల యుద్దంలో కాంగ్రెస్ లీడర్ విజయశాంతి ఎంట్రీ ఇవ్వడం చర్చకు దారి తీసింది. అయితే టీఆర్ఎస్ పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసి తదనంతర పరిణామాలతో అక్కడ పొసగక కాంగ్రెస్ గూటికి చేరిన రాములమ్మ ఈ విధంగా కక్ష తీర్చుకున్నారా.. లేదంటే పార్టీ మారే యోచనలో బీజేపీ వైపు చూస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు తెలంగాణలో నిధుల స్వాహాపై నడ్డా తన దగ్గరున్న ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేయాలని, కేసీఆర్ ప్రభుత్వంపై విచారణ జరిగిలా చూడాలని సూచించడం కూడా చర్చనీయాంశమైంది.
కాంగ్రెస్ను వీడుతానంటూ గాంధీ భవన్ నుంచే కుట్రలు..!
ఆదివారం నాడు విజయశాంతి పార్టీ మారబోతున్నారనే ప్రచారంపై ఆమె స్పందించారు. ఆ మేరకు మీడియాకు ఓ ప్రకటన లేఖ విడుదల చేశారు. తాను పార్టీ మారబోతున్నానంటూ కొందరు కావాలనే కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. అది కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీ భవన్ నుంచే కుట్ర ప్రారంభమైందని హాట్ కామెంట్స్ చేశారు. అంతేకాదు పార్టీ మార్పుపై హడావుడిగా తాను నిర్ణయం తీసుకోబోనంటూ స్పష్టం చేశారు. ఇప్పటివరకు పార్టీ మారే విషయంలో ఎలాంటి ఆలోచన లేదన్న విజయశాంతి.. అలాంటిది ఏమైనా ఉంటే తప్పకుండా బహిరంగంగానే ప్రకటిస్తానంటూ చెప్పుకొచ్చారు.
వినాయక చవితికి చందాలు బందే.. బలవంతపు వసూళ్లకు పాల్పడితే అంతే..!
పార్టీ మారేది లేదంటూ.. నడ్డాకు సపోర్ట్ ఏంటో మరి..!
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్న విజయశాంతి తనకు పార్టీ మారే యోచన లేదన్నట్లుగా స్పష్టం చేశారు. అయితే ఆదివారం నాడు ఆ ప్రకటన చేశాక.. రెండు రోజులకే అంటే మంగళవారం నాడు నడ్డా - కేటీఆర్ మధ్య సాగిన మాటల యుద్దంలో తానూ ఎంటరయ్యారు. కేటీఆర్ను ఏకిపారేస్తూ.. నడ్డాకు సపోర్ట్గా మాట్లాడిన తీరు మరోసారి చర్చకు దారి తీసింది. ఆ క్రమంలో బీజేపీ నేతలను ఆకర్షించడానికి రాములమ్మ ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు లేకపోలేదు.
ఇదివరకు బీజేపీ తీర్థం పుచ్చుకుని బయటకు వచ్చిన విజయశాంతి మరోసారి కమలం పువ్వు వైపు చూస్తున్నారనే వాదనలు కొకొల్లలు. బీజేపీ నేతగా పనిచేసిన సమయంలో ఆమె ఢిల్లీ పెద్దలతో పరిచయాలు పెంచుకున్నారు. ఇప్పటికీ కూడా కొందరు బీజేపీ నేతలతో ఆమె టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు శరవేగంగా మారుతున్న ఈ సమయంలో రాములమ్మ యూ టర్న్ తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాలి.