ఢిల్లీలో చంపుకోలేదా?: అమిత్ షాకు కేటీఆర్ ప్రశ్న -మోదీ మాటనే టీఆర్ఎస్ చెబుతోందన్న మంత్రి
''బీజేపీ ఏనాడూ హింసా రాజకీయాలు చేయలేదు. సీఎం కేసీఆర్ ను కొట్టడానికో, చంపడానికో మేం ఇక్కడికి రాలేదు. కేసీఆర్ నూరేళ్లు బతకాలి. అయినా, హైదరాబాద్ లో ఎక్కడ మత ఘర్షణలు జరిగాయి? కుట్రలు చేస్తున్నారని, కేంద్రం ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తోందని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడం అనుచితంగా ఉంది''అంటూ కేసీఆర్పై సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి అమిత్ షాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ప్రధాని మోదీని సైతం ప్రస్తావిస్తూ మంత్రి అనూహ్య వ్యాఖ్యలు చేశారు.
ఎందుకు చంపుతాం? కేసీఆర్ 100ఏళ్లు బతకాలి: అమిత్ షా సంచలనం -కామెంట్లు చూస్తే షాకవుతారు
అమిత్ షా దుమారం..
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో చివరిరోజైన ఆదివారం అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తించాయి. బీజేపీ తరఫున కేంద్ర హోంమంత్రి అమిత్ షా నగరంలో రోడ్ షో నిర్వహించారు. అనంతరం బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్-ఎంఐఎం, కేసీఆర్-ఓవైసీలను జంటగా పేర్కొంటూ దనుమాడారు. మత ఘర్షణలకు బీజేపీ కుట్రలు చేస్తోందన్న కేసీఆర్ వ్యాఖ్యలు అర్థంలేనివని షా అన్నారు. ‘కేసీఆర్ ను చంపడానికో లేదా కొట్టడానికో ఇక్కడికి రాలేద'ని షా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
బండి సంజయ్ మరో బండ్ల గణేష్ -బీజేపీ చీఫ్ సంచలన కామెంట్లపై కవిత ఫైర్ -బండ్ల అనూహ్య రియాక్షన్
ఢిల్లీలో జరిగిందేంటి?
ఎన్నికల సమయంలో మత ఘర్షణలు తలెత్తేలా బీజేపీ వ్యవహరిస్తుందన్న ఆరోపణ అవాస్తవమేమీ కాదనే అర్థంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. శత్రుదేశాలపై చేసే వాటని సర్జికల్ స్ట్రైక్స్ అంటారని.. బీజేపీ నేతలకు హైదరాబాద్ శత్రుదేశంలా కనిపిస్తోందా?అని ప్రశ్నించారు. ఎక్కడ మత ఘర్షణలు జరిగాయని అమిత్షా ప్రశ్నిస్తున్నారని.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటన, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఢిల్లీలో అల్లర్లు జరగలేదా? అని కేటీఆర్ నిలదీశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న హింసలో మొత్తం 51 మంది ప్రాణాలు కోల్పోగా, వారిలో 35 మంది ముస్లింలు, 15 మంది హిందువులుండటం, కేంద్ర సర్కారు ఆధ్వర్యంలోని ఢిల్లీ పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడం తెలిసిందే.
అహ్మదాబాద్ కాదు.. హైదరాబాద్
‘‘పొలిటికల్ టూరిస్టుల్లా వట్టి చేతులతో వచ్చిన కేంద్ర మంత్రులకు స్వాగతం. హైదరాబాద్ లో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడింది టీఆర్ఎస్ మంత్రులే. వరద సహాయం చేస్తుంటే, ఎక్కడ కేసీఆర్ కు మంచి పేరు వస్తుందోనని బీజేపీ ఫిర్యాదు చేయడంతో నిలిచిపోయింది. జంగిల్ రాజ్(యూపీ) నుంచి వచ్చిన ఓ ముఖ్యమంత్రి(యోగి) ఇక్కడ నీతులు చెబుతున్నాడు. అమిత్ షా గారూ బాగా వినండి.. మాది నిజాం సంస్కృతి కాదు. మీరు చెప్పేది వినడానికి ఇది అహ్మదాబాద్ కాదు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని, తలా రూ15లక్ష్లలు ఇస్తామని మోదీ చెప్పారు. ఆ సంగతేంటో తేల్చండి. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో వాతావరణం చెగడొట్టొద్దు'' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అంతేకాదు,
మోదీ మాటలే టీఆర్ఎస్ నోట..
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ‘బీజేపీ బీహార్ స్ట్రాటజీ'ని మంత్రి కేటీఆర్ ప్రస్తావించారు. ‘‘ఇటీవలి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందని, రాష్ట్రంలోనూ ఆ పార్టీనే గెలిస్తే డబుల్ ఇంజిన్ గ్రోత్ సాధ్యమవుతుందన్నారు. ప్రధాని మాటలనే టీఆర్ఎస్ కూడా చెబుతోంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నే గ్రేటర్ లోనూ గెలిపిస్తే డబుల్ ఇంజన్ గ్రోత్ ఉంటుందని ప్రజలకు హామీ ఇస్తున్నాం. బీజేపీ నేతలు మాత్రం తాము గెలిస్తే.. ఇది కూలగొడతాం.. అది ధ్వంసం చేస్తామని అంటున్నారు. ప్రశాంత నగరం కావాలో, అట్టుడికే హైదరాబాద్ కావాలో ప్రజలే తేల్చుతారు'' అని కేటీఆర్ అన్నారు.