భాషపై పట్టు, స్పష్టమైన ఉచ్చారణ.!అసెంబ్లీలో మంత్ర ముగ్దులను చేసిన కేటీఆర్ ప్రసంగం.!
హైదరాబాద్ : తెలంగాణ వానాకాల శాసనసభ సమావేశాలు బుదవారం రోజున నిరంతరాయంగా వాయిదా పడ్డాయి. శాసన సభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు, సభ్యుల సవాళ్లకు ప్రతిసవాళ్లు, చమత్కారాలు, హాస్య సన్నివేశాలు, సమయస్పూర్తితో కూడిన సమాధానాలు చోటు చేసుకుంటాయి. ఒక్కోసారి సభ సభ్యుల నిరసన నినాదాలతో హోరెత్తి వాక్ అవుట్ వరకూ దారి తీస్తాయి. కొన్ని సందర్బాల్లో సభకు అంతరాయం కల్పిస్తున్న కారణంగా కొంత మంది సభ్యులను మార్షల్స్ తో సభనుంచి పంపించి వేయడం వంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. కాగా బుదవారం ముగిసిన తెలంగాణ శాసన సభలో రెండు అరుదైన అంశాలు తెలంగాణ ప్రజలను విపరీతంగా ఆకర్శించాయి.
పద ప్రయోగంలో ఏమాత్రం తడబడని కేటీఆర్.. ప్రశంసలందుకుంటున్న మంత్రి ప్రసంగం..
శాసనసభ సమావేశాలు అంటేనే అధికార, ప్రతిపక్ష పార్టీలకు సవాల్ గా పరిణమిస్తుంటాయి. ప్రతిపక్ష పార్టీల విమర్శలను తిప్పికొట్టాలని అధికార పార్టీ, అధికార పార్టీని ఇరుకున పెట్టాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో సభలోకి అడుగుపెడుతుంటాయి. ఈ సందర్బంగా ఒక్కోసారి ఇరు పార్టీల మధ్య యుద్ద వాతావరణం చోటు చేసుకుంటుంది, మరి కొన్ని సార్లు హాస్యంతో కూడుకున్న ఆహ్లాదవాతావరణం ఏర్పడుతుంది. శాసన సభ కార్యక్రమ వ్యవహారాల్లో సర్వ సాధారణంగా కొనసాగే ప్రక్రియ ఇది. ఐతే తెలంగాణ వర్షాకాల సమావేశాలు కొనసాగింది కేవంలం ఎనిమిది రోజులే ఐనప్పటికి మున్సిపల్ శాఖా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చక్కని తెలుగు భాషను, అతి స్పష్టంగా ఉచ్చరించి అందరి దృష్టిని ఆకర్శించినట్టు స్పష్టమవుతోంది.
క్లిష్ట పదాలను సైతం సునాయాసంగా పలికిన యువ మంత్రి.. కేటీఆర్ ప్రసంగంపై పొగడ్తలు..
తెలంగాణ వానాకాల అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగం, ప్రతిపక్ష పార్టీ నేతల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానం, ప్రభుత్వం తరుపున ఇచ్చిన వివరణ ఎంతో స్పష్టంగా ఉండడంతో పాటు, తెలుగు భాషలోని పదాలను ఆయన ఉచ్చరించిన తీరు మహాద్బుతంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. విపక్షాలకు సమాధానం ఇస్తున్నప్పుడు తడబడడంగాని, ఫంబుల్ అవ్వడం గాని, మాటలు పొరపాటుగా దొర్లడంగాని, గుటకలు పడటంగాని, నాలికి కరుచుకోవడం వంటి బెరుకు లేకుండా గలగలపారే సెలయేరు చిరు సవ్వడిలా కేటీఆర్ ప్రసంగం సాగిపోయినట్టు తెలుస్తోంది. ఒక్క తెలుగు భాషలోనే కాకుండా హింది, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో ప్రసంగించాల్సి వచ్చినప్పుడు కూడా అంతే స్పష్టతతో మాట్లాడిన తీరు సభలోని సభ్యులను ఎంతగానో ఆకర్శించినట్టు తెలుస్తోంది.
అన్ని భాషల్లో మంచి పట్టు.. ఆకర్షణీయంగా మారిన కేటీఆర్ ప్రసంగం..
అంతే కాకుండా తెలుగులోని క్లిష్టమైన పదాలనుండి అతిక్టిష్టమైన పదాల వరకూ నిండు సభలో కేటీఆర్ సునాయాసంగా పలికినట్టు తెలుస్తోంది. అప్రతిహతంగా, ప్రతిష్టాత్మకంగా, చిరస్మరణీయంగా, ప్రజా ప్రశంసలు, చరిత్రాత్మకం, ప్రదర్శనలు, భూగర్బ డ్రైనేజీ వ్యవస్ధ, ప్రత్యారోపణలు, క్షేత్రస్ధాయిలో, ప్రజాభీష్టం, ఆమోదయోగ్యం, ప్రత్యామ్నాయం, సంయమనం, సమావేశాల సమీక్షలు వంటి పదాలను కేటీఆర్ చిన్న తడబాలు లేకుండా అతిస్పష్టంగా పలికిన విధానం ఆసక్తికరంగా ఉందనే చర్చ జరుగుతోంది. చట్ట సభల్లో కేటీఆర్ భాష ఇంత పాలిష్ గా ఉంటే ప్రజా క్షేత్రంలో తెలంగాణ యాస కూడా అంతే స్పష్టంగా మాట్లాడే సమర్థత ఒక్క కేటీఆర్ కే ఉన్నట్టు చర్చ జరుగుతోంది.
ప్రతిపక్ష నేత భట్టి లోతైన విశ్లేషణ..సమస్యలను ప్రస్తావించిన విధానం భేష్ అంటున్న ప్రజలు..
ఇక తెలంగాణ లోని ప్రజా సమస్యలు, జిల్లాల పరిస్ధితి, ప్రభుత్వాసుపత్రుల్లోని మౌళిక సదుపాయాలు, కరోనా బాదితులు పడుతున్న కష్టాల గురించి ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క లోతుగా విశ్లేషించిన విధానం కూడా తెలంగాణ ప్రజలను ఆకట్టుకున్నట్టు చర్చ జరుగుతోంది. యువతకు ఉపాది కల్పన, నగర అభివృధ్తి, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు, తెలంగాణ ప్రభుత్వం రూపకల్పన చేసిన కొత్త రెవెన్యూ చట్టంలోని లోపాలు, అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటు తదితర అంశాలపై భట్టి విక్రమార్క చేసిన ప్రసంగం ఆలోచింపచేసేదిగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. శాసన సభ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రసంగం హైలైట్ గా నిలుస్తుంటుంది. కాని ఈ సారి చంద్రశేఖర్ రావు ఎప్పుడూ చేసే రొటీన్ ప్రసంగాన్నే కొనసాగించారనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తానికి తెలంగాణ శాసన సభా సమావేశాలు ప్రతిపక్ష నేత భట్టి, మంత్రి కేటీఆర్ ల సమర్థతను ప్రజలకు చెప్పకనే చెప్పినట్టు నిర్దారణ అవుతోంది.