మానవ మృగానికి ఉరిశిక్ష సరైందే.. కోర్టు తీర్పుపై కేటీఆర్ హర్షం
హైదరాబాద్ : అభం శుభం తెలియని 9 నెలల చిన్నారిపై పైశాచికంగా అత్యాచారం చేసి హతమార్చిన కేసులో నిందితుడు ప్రవీణ్ కుమార్కు వరంగల్ జిల్లా అదనపు కోర్టు ఉరిశిక్ష విధించింది. న్యాయస్థానం తీర్పుతో రాష్ట్రమంతటా హర్షం వ్యక్తమవుతోంది. సదరు నేరస్థుడు ఘాతుకానికి పాల్పడ్డ ఘటన వెలుగుచూసినప్పుడే వాడికి ఉరే సరైన శిక్ష అనే కామెంట్లు వినిపించాయి. వరంగల్ పోలీసులు ఆ కేసును సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడంతో పాటు 20 రోజుల్లోగా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు. దాదాపు 30 మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించారు. అయితే ఆ ఘటన జరిగిన 50 రోజుల్లోనే కేసు దర్యాప్తు చేసి శిక్షను ఖరారు చేయడం కొసమెరుపు.
హన్మకొండలో జూన్ 18వ తేదీ అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. 9 నెలల చిన్నారిపై అమానుషంగా ప్రవర్తించిన నిందితుడిని శిక్షించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్నివర్గాల ప్రజలు గొంతెత్తి నినదించారు. ఆ క్రమంలో వాడికి న్యాయస్థానం ఉరిశిక్ష విధించడంపై హర్షం వ్యక్తమవుతోంది. ఆ క్రమంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు న్యాయస్థానం తీర్పును స్వాగతించారు.
రేవంత్ రెడ్డి గరం.. గరం..! ఫోన్లు కూడా లిఫ్ట్ చెయ్యరా అంటూ జీహెచ్ఎంసీ అధికారలకు క్లాస్!!
9 నెలల చిన్నారిపై రేప్ చేసి హత్య చేసిన కేసులో ముద్దాయి ప్రవీణ్ కుమార్కు తగిన శాస్తి జరిగింది. వరంగల్ జిల్లా అడిషనల్ కోర్టు ప్రవీణ్ కుమార్కు ఉరిశిక్ష విధించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఆ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. వరంగల్ చిన్నారిని అమానుషంగా చంపిన కేసులో వరంగల్ అదనపు కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతేకాదు మరింత కఠినమైన చట్టాలు తేవాలని ఆకాంక్షించారు. చిన్నారి కేసులో న్యాయం కోసం వాదించిన న్యాయవాదులకు అభినందనలు అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.
Death penalty verdict by court of law for the animal who molested a child in Warangal is a welcome judgement👏
— KTR (@KTRTRS) August 8, 2019
We need more stringent laws and fast track courts to take these horrendous offenders off our streets
My compliments to the advocates who fought hard👍#JusticePrevails
ఈ కేసులో ముద్దాయి ప్రవీణ్ కుమార్ హన్మకొండలోని ఓ హోటల్లో పనిచేసేవాడు. పని వేళల తర్వాత కనపడ్డ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని తెలుస్తోంది. ఆ క్రమంలో 9 నెలల చిన్నారి ఇంటికి వెళ్లి రెండు సెల్ఫోన్లను దొంగిలించడమే గాకుండా.. మేడపై తల్లితో కలిసి నిద్రిస్తున్న చిన్నారిని అపహరించుకుని పోయి నిర్మానుష్య ప్రాంతంలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ చిన్నారి మేనమామ ఫిర్యాదు మేరకు నిందితుడిపై 366, 302, 376ఎ, 376ఏబీ, 379, 5 (ఎం) రెడ్ విత్ 6 ఆఫ్ పోక్సో యాక్షన్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మొత్తానికి వాడికి ఉరిశిక్ష పడటంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.