వంటేరు చెప్పిందే నిజం, పదేళ్ల తర్వాత ఈ నిర్ణయం, ఎన్నికల టైంలోని వాటిని వదిలేయండి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ఆలస్యంగా అయినా మంచి నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శుక్రవారం అన్నారు. 2014, 2018లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పైన పోటీ చేసిన కేటీఆర్ ఇప్పుడు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే క్రమంలో కేసీఆర్ ప్రాణాలు పణంగా పెట్టారని చెప్పారు. వంటేరు చేరికతో గజ్వెల్లో తెరాస తిరుగులేని శక్తిగా మారిందని చెప్పారు. బంగారు తెలంగాణ సాకారం అవుతుందని చెప్పారు. రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రాన్ని శాసించాలన్నారు.
వంటేరు చెప్పిందే నిజం, పదేళ్ల తర్వాత పార్టీలో చేరారు
వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పిన మాట వాస్తవమేనని, 2009లోనే తెరాసలోకి రావాలని వారిని ఆహ్వానించామని, ఆ తర్వాత మరోసారి కూడా కలిసి పని చేద్దామని అడిగామని, కానీ ఇప్పుడు ఆయన పార్టీలో చేరారని కేటీఆర్ అన్నారు. 2009 నుంచి అడిగితే... పదేళ్ల తర్వాత 2019లో పార్టీలో చేరి మంచి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. పార్టీలోకి రావడానికి ఆయనకు పదేళ్లు పట్టిందన్నారు. గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు అదృష్టవంతులు అన్నారు. సాధారణంగా అడిగితేనే అభివృద్ధి జరుగుతుందని, కానీ గజ్వెల్ నియోజకవర్గంలో అడగకుండానే నిధుల వరద పారుతోందన్నారు. తెలంగాణలో కోటి ఎకరాల మాగాణి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మనకు 45 శాతం నుంచి 50 శాతం ఓట్లు వచ్చాయని తెలిపారు.
అదే జరిగితే కేసీఆర్ చెప్పిన వంద సీట్లు వచ్చేవి
వంటేరు ప్రతాప్ రెడ్డి చెప్పినట్లు మనం గెలిచిన చోట వేలు, లక్షలాది ఓట్ల మెజార్టీతో గెలిచామని, కానీ విపక్షాలు గెలిచిన చోట వందలు మాత్రమే ఉన్నాయని కేటీఆర్ అన్నారు. లేదంటే కేసీఆర్ చెప్పినట్లుగా వంద సీట్లు వచ్చేవని చెప్పారు. పన్నెండు, పదమూడు సీట్లలో రెండు వేలు, మూడవేల ఓట్లతోనే వారు గెలిచారని చెప్పారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో మనం 16 సీట్లు గెలుచుకోవాలని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పార్లమెంటు ఎన్నికల్లోను రిపీట్ కావాలన్నారు.
వంటేరు చాలా ఓపెన్ గురూ.. టీఆర్ఎస్లో ఎందుకు చేరుతున్నాడో దాచుకోకుండా చెప్పేశారు
కేసీఆర్ ఫ్రంట్
వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీ మళ్లీ గెలవదని కేటీఆర్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు వంద వరకు వస్తాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కలిసినా 273 సీట్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఉత్తర ప్రదేశ్లో బీజేపీ, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా ఎస్పీ, బీఎస్పీలు ఒక్కటయ్యాయని చెప్పారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా బీజేపీయేతర, కాంగ్రెస్సేతర కూటమికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కేటీఆర్ అలాంటి ఫ్రంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.
ఎన్నికల సమయంలో చాలా అనుకుంటాం
ఎన్నికల సమయంలో భావోద్వేగాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. చాలా అనుకుంటామని (విమర్శలు చేసుకోవడాన్ని ఉద్దేశిస్తూ) కేటీఆర్ చెప్పారు. చాలాసార్లు మాటలు అనుకుంటామని చెప్పారు. మన తెలంగాణ వారి సంగతి అందరికీ తెలిసిందేనని, మనకు కోపం వచ్చినా ఆగదు, ప్రేమ వచ్చినా ఆగదని చెప్పారు. కోపం వస్తే కచ్చితంగా అంటామని, అలాగే ప్రేమ వస్తే అలాగే కలిసి ఉంటామని చెప్పారు. ఎన్నికల సమయంలో, రాజకీయాల్లో చాలా మాటలు అనుకుంటామన్నారు. వాటన్నింటిని కూడా మనసులో నుంచి తీసేసి, ఈ రోజు తెలంగాణ ప్రజలు కోరుకున్న బంగారు తెలంగాణ కోసం పని చేద్దామన్నారు. దేశ రాజకీయాలను తెలంగాణ శాసించే విధంగా పని చేద్దామన్నారు.