బోనమెత్తిన లాల్దర్వాజ.. అమ్మోరి ఆలయాలు కిటకిట
హైదరాబాద్ : ఆషాఢ మాసం బోనాలు తుది అంకానికి చేరుకున్నాయి. గోల్కోండ కోటలో తొలివారం.. ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి. ఆ క్రమంలో ఈ ఆదివారం పాతబస్తీ లాల్ దర్వాజ బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. దాంతో హైదరాబాద్లోని పలుచోట్ల అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తూ భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు.
లాల్ దర్వాజ సింహ వాహిని అమ్మవారి ఆలయంలో తెల్లవారుజాము నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. ఉదయం 5 గంటలకు అమ్మవారిని అభిషేకించారు. భక్తులు అమ్మవారిని కొలిచి మొక్కుతూ బోనాలు సమర్పిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సోమవారం సాయంత్రం రంగం కార్యక్రమం నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.
సీఎం కుర్చీ కాదని.. రాజకీయాల్లో అజాత శత్రువు.. జైపాల్ రెడ్డి సుదీర్ఘ ప్రస్థానం
నగరంలోని పలు ప్రాంతాల్లో బోనాల వేడుకల సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దాదాపు 2 వేలకు పైగా ఆలయాల్లో ఆషాఢ మాసం బోనాలు వైభవంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. చార్మినార్ భాగ్యలక్ష్మి, మీరాలం మండి మహంకాళి, హరిబౌలి అక్కన్న మాదన్న ఆలయం, కార్వాన్ దర్బార్ మైసమ్మ, లోయర్ ట్యాంక్ బండ్ కట్ట మైసమ్మ తదితర ఆలయాలు తెల్లవారుజాము నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ఆషాఢ మాసం బోనాలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. ఈ ఆదివారంతో బోనాల జాతర ముగియనుంది. ఇక సోమవారం నాడు పలు ఆలయాల్లో రంగం కార్యక్రమం నిర్వహించనున్నారు. పలహార బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల మహాఘట్టం పూర్తికానుంది.