భూవివాదం.. మంత్రి మల్లారెడ్డితో ప్రాణహాని ఉందని హెచ్ఆర్సీని ఆశ్రయించిన మహిళ
కెసిఆర్ క్యాబినెట్ మంత్రి చామకూర మల్లారెడ్డి మొదటి నుండీ పలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా ఆయన మరో వివాదంలో చిక్కుకున్నారు. ఒక భూ వివాదంలో ఆయన ఒక మహిళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారన్న వార్తలు తాజాగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఏకంగా ఆ మహిళ మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించటం హాట్ టాపిక్ గా మారింది.
కేసీఆర్ జన్మదినం ఇక నుండి రైతు దినోత్సవం గా .. ఆసక్తికర ప్రకటన చేసిన తెలంగాణా మంత్రి
తెలంగాణా మంత్రి మల్లారెడ్డి ఇప్పుడు ఓ భూ వివాదంలో చిక్కుకున్నారు. మేడ్చెల్ జిల్లా సూరారంలో ఒక భూమి విషయంలో మంత్రి కబ్జాకు పాల్పడుతున్నారని ఒక మహిళ ఆరోపిస్తున్నారు. తనకు చెందిన 33 కుంటల భూమిని మంత్రి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన సదరు మహిళ మంత్రి మల్లారెడ్డితో తమకు ప్రాణహాని ఉందనిఏకంగా మానవ హక్కుల కమీషన్ ను ఆశ్రయించటం తెలంగాణాలో సంచలనంగా మారింది.
మంత్రి మల్లారెడ్డికి సూరారంలో రెండు ఆసుపత్రులు ఉన్నాయని, ఆ ఆసుపత్రుల మధ్యలో తన స్థలం ఉండడంతో కబ్జా ప్రయత్నాలు చేస్తున్నారని శ్యామలాదేవి అనే మహిళ ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇక ఈ నేపధ్యంలోనే తెలంగాణ మంత్రి మల్లారెడ్డిపై పి.శ్యామలాదేవి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. మంత్రి మల్లారెడ్డికి సహకరిస్తూ పోలీసులు కూడా తనకు న్యాయం చెయ్యటం లేదని ఆమె ఆరోపిస్తున్నారు.
ఇక మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొన్న ఆమె అధికారులు సైతం మంత్రికే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భూమి తనకు ఉండేలా చూడాలని ,మంత్రిపై చర్యలు తీసుకోవాలని ,తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆమె హెచ్చార్సీకి విజ్ఞప్తి చేశారు.