పెరగనున్న భూముల మార్కెట్ విలువ.. రిజిస్ట్రేషన్ కోసం కొనుగోలుదారుల ఆరాటం..
తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలకు మార్కెట్ విలువ పెరగబోతోందనే అంశం కొనగోలుదారులను భయపెడుతుంది. స్థిరాస్తుల మార్కెట్ విలువ పెంపు ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. స్థిరాస్తి వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వాణిజ్య భవనాలు, అపార్టుమెంట్ల మార్కెట్ విలువ మదింపు జరగబోతుందనే వార్త వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.
వీరిలో కొందరు ఇప్పటికే జీపీఏ, కొనుగోలు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ ఎంత పెంచుతారో? స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీల బాదుడు ఏ మేరకు ఉంటుందో? తెలియక ఇబ్బందిరి గురవుతున్నారు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది జీపీఏ చేసుకున్నారు.
భూముల విలువ..
రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు గడువు ఉన్నప్పటికీ వచ్చే నెల నుంచి భూముల విలువలు పెరగనున్నాయనే వార్తలతో అధనపు భారం నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకోవడం, తేదీలు ఖరారు కావడంతో సబ్ రిజిస్ట్రార్, తహసీల్దారు కార్యాలయాలను ఆశ్రయిస్తున్నారు.
ఇటీవలే అగ్రిమెంట్లు చేసుకున్న వారు కూడా రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకోవడానికి మీ సేవా కేంద్రాలు, ఆన్లైన్ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. జనవరి 31లోపే రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు కొందరు ఈ చలాన్లు చెల్లిస్తున్నారు. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు స్థలాలు, ఇళ్ల కొనుగోళ్ల కోసం అడ్వాన్సులు ఇచ్చిన మధ్యతరగతి వారికి పెరగనున్న మార్కెట్ విలువలు ఆందోళన కలిగిస్తున్నాయి.
వడ్డింపులు..
కొత్త ఆర్థిక సంవత్సరం నుంచే వడ్డింపులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. కొందరు మార్చి, ఏప్రిల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని అడ్వాన్స్ ఇచ్చి ఒప్పందాలు చేసుకున్నారు. వీరు కూడా ఈ నెలాఖరులోపే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ ద్వారా వస్తున్న ఆదాయంపై అధికారుల అంచనాలు పెరుగుతున్నాయి.
2021-22 ఆర్థిక సంవత్సరానికి డిసెంబరులో అత్యధికంగా రూ.1,030 కోట్ల ఆదాయం సమకూరింది. నెలలవారీగా చూస్తే స్థిరాస్తి లావాదేవీల ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రెట్టింపు అవుతూనే ఉంది. గత ఏడాది మే మినహాయిస్తే మిగిలిన 9 నెలల్లో రాబడి పెరుగుతూనే ఉంది.
పెరిగిన రాబడి
2021 ఏప్రిల్ నుంచి 2022 జనవరి 26 నాటికి రిజిస్ట్రేషన్ శాఖకు రూ.6,932.70 కోట్ల ఆదాయం సమకూరింది. ప్రభుత్వం ఆర్థిక సంవత్సరానికి వేసిన ఆదాయ అంచనా రూ.12,500 కోట్లు. కరోనా నేపథ్యంలో రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడం, ధరణి అమల్లోకి తెచ్చే సమయంలో భూముల విక్రయాలు ఆగిపోవడంతో రాబడి తగ్గినట్లు చెబుతున్నారు.
మళ్లీ రిజిస్ట్రేషన్లు పుంజుకోవడంతో రాబడి పెరిగింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.748 కోట్ల ఆదాయం వచ్చింది. నెలాఖరుకు రూ.1000 కోట్లు దాటే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల నుంచే రిజిస్ట్రేషన్ల శాఖకు అంచనాలకు మించి ఆదాయం సమకూరుతోంది. హనుమకొండ, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సిద్దిపేట జిల్లాల్లోనూ రియల్ బూం కొనసాగుతోంది