లష్కర్ రంగం : ఈ ఏడాది పుష్కలంగా వర్షాలు.. కానీ.. అమ్మోరు అలా ఎందుకు చెప్పినట్లో..!
హైదరాబాద్ : భాగ్యనగరంలో ఆషాఢమాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం నాడు లష్కర్ ఉజ్జయిని మహాంకాళి బోనాలకు భక్తజనులు పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని, బోనాలు సమర్పించి భక్తితన్మయత్వంలో మునిగితేలారు. సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు విచ్చేసి అమ్మోరి ఆశీస్సులు తీసుకున్నారు.
అదలావుంటే బోనాల మరునాడు జరిగే రంగం కార్యక్రమం వీక్షించేందుకు పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. పచ్చికుండ మీద నిలబడి అమ్మోరు ఆవహించిన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. లష్కర్ బోనాల్లో ఈ కార్యక్రమం అత్యంత కీలకమైనది కావడంతో ఆలయ నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
Recommended Video
పచ్చికుండ మీద అమ్మోరి భవిష్యవాణి
ఆషాఢ మాస బోనాల ఉత్సవాల్లో భాగంగా ఆదివారం (21.07.2019) నాడు జరిగిన లష్కర్ ఉజ్జయిని మహాంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. బోనాల జాతరలో భాగంగా సోమవారం (22.07.2019) నాడు ఉదయం పది గంటల సమయంలో ప్రారంభమైన రంగం కార్యక్రమం కనులపండువగా జరిగింది. అమ్మవారి భక్తురాలైన మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు.
ఆలయం ఆవరణలో అమ్మవారికి అభిముఖంగా నిలబడ్డ మాతంగి స్వర్ణలత పచ్చికుండ మీద నిలబడి అమ్మవారిని ఆవహించుకున్నారు. అనంతరం భక్తులు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు. అమ్మవారి వైపు తదేకంగా చూస్తూ భవిష్యవాణి వినిపించారు. ఈ సంవత్సరం భక్తులు తనకు చేసిన పూజల పట్ల సంతృప్తి చెందానని.. ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లుతారని వెల్లడించారు.
టికెట్ టికెట్.. కండక్టర్ అరుపులు కాదు.. నేతల గుండెల్లో గుబులు..!
వర్షాలు బాగానే పడతాయి.. కానీ ఇలా చేయండి..!
ప్రతి సంవత్సరం సంతోషంగా తన దగ్గరకొచ్చే భక్తుల్లో ఈ ఏడాది మాత్రం ఆనందం కనిపించడం లేదని.. ఆడపడుచులు దుఃఖంతో ఉన్నట్లు కనిపించారని చెప్పుకొచ్చారు. బంగారు బోనంతో తనను సంతోషపెట్టాలనేది మూర్ఖత్వమే అవుతుందని వెల్లడించారు. ఏదిఏమైనా ఈ ఏడాది మాత్రం ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారని భక్తుల ప్రశ్నలకు సమాధానంగా చెప్పారు. ఇక వర్షాల గురించి ఒకరు మాట్లాడుతూ వానలు సరిగా పడట్లేదని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ.. ఈసారి వర్షాలు భారీగానే పడతాయని చెప్పారు.
గంగాదేవికి బోనం, జలాభిషేకం.. సమృద్దిగా వర్షాలు ఖాయం
వర్షాలు పడట్లేదంటే ప్రజలు కొన్ని మరిచిపోయారని గుర్తు చేశారు. తన సోదరి గంగాదేవికి బోనం సమర్పించాలని.. అలాగే జలాభిషేకం కూడా చేస్తే వానలు తప్పకుండా పడతాయని వెల్లడించారు. తన తోబుట్టువులు అందరూ కూడా ఈసారి ఆనందంగానే ఉన్నారని.. ప్రజలకు వచ్చిన కష్టమేమీ లేదని తెలిపారు. ప్రజలందరి సమక్షంలో పూజలు ఘనంగా అందుకున్నానని.. ఆలయ సిబ్బంది కూడా తన బిడ్డలేనంటూ వారిని సంతోషపెట్టే విధంగా బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు.
బోనాల జాతరలో భాగంగా ఆలయ నిర్వాహకులు చేసిన కార్యక్రమాలు తనను సంతృప్తి పరిచాయని చెప్పుకొచ్చిన అమ్మవారు మారు బోనం తీయడం మరిచిపోయారని.. అది తప్పకుండా తీయాలని సూచించారు. అంతేకాదు ఐదు వారాల పాటు వివిధ పలహారాలతో పాటు బెల్లంపుట్నాలతో తనకు సాకలు సమర్పించాలని కోరారు. ఒక వారం చూసుకుని తన అక్కాచెళ్లెల్లతో కలిసి పొలిమేర వరకు బోనాలు తీయాలని తెలిపారు. తనను నమ్ముకున్న ప్రజలకు ఎలాంటి ఆపద రానివ్వనని చెబుతూ అందర్నీ కాపాడే బాధ్యత తనదంటూ ముగించారు.