లష్కర్ బోనాలకు శ్రీకారం.. బంగారు బోనం దర్శించుకునే అవకాశం
సికింద్రాబాద్ : భాగ్యనగరంలో బోనాల సందడి షురువైంది. ఈ నెల 4వ తేదీన గోల్కొండ కోటలో బోనాల జాతరకు అంకురార్పణ జరిగింది. ఆ క్రమంలో ఆదివారం (07.07.2019) నాడు సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళీ ఆలయంలో బోనాల ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఎదుర్కోళ్లతో బోనాల వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
ఏడాది పొడవుగా హైదరాబాద్ వాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే బోనాల జాతర సందడి మొదలైంది. నగరంలోని బస్తీ, వాడా ముస్తాబైంది. అమ్మవార్ల ఆలయాలు కొత్త శోభ సంతరించుకున్నాయి. నెల రోజుల పాటు జరిగే బోనాల జాతర వేడుకలు కనువిందు చేయనున్నాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల సిగాలు, డీజేల హోరు, పాటలు వెరసి ఆషాఢమాస బోనాలు నగరవాసులను ఆధ్మాత్మిక తరంగంలో ఓలలాడిస్తాయి.
అవినీతి అక్రమాలు వద్దు.. పారదర్శకంగా సేవలు.. కొత్త అర్బన్ పాలసీపై కేసీఆర్ దిశానిర్దేశం
ఆదివారం నాడు లష్కర్ బోనాల జాతరకు శ్రీకారం చుట్టడంతో.. ఉజ్జయిని మహంకాళి ఆలయానికి పెద్దఎత్తున భక్తుల పోటెత్తారు. అమ్మవారిని దర్శించుకుని భక్తిపారవశ్యంలో మునిగితేలారు. బోనాల జాతరకు నాంది పలుకుతూ ఎదుర్కోళ్ల మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆ క్రమంలో బోనాల వేడుకలు ముగిసేంతవరకు మహంకాళీ ఆలయం గర్భగుడిలో బంగారు బోనం దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించారు.
గోల్కొండ బోనాలు గురువారం నాడు ప్రారంభమయ్యాయి. ఆదివారం నాడు కూడా బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. జగదాంబ అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు క్యూ కట్టారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశామని పోలీసులు తెలిపారు. గోల్కొండ ప్రాంతం మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉందని తెలిపారు.