తెలంగాణ తాజా హెల్త్ బులెటిన్.. 404కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు..
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 404కి పెరిగింది. మంగళవారం కొత్తగా మరో 40 పాజిటివ్ కేసులు నమోదైనట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు 45 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయినట్టు తెలిపింది. ప్రస్తుతం 348 యాక్టివ్ పాజిటివ్ కేసులు ఉండగా.. 11 మంది మృత్యువాతపడ్డారు. యాక్టివ్ కేసుల్లో హైదరాబాద్లో అత్యధికంగా 150 కేసులు నమోదు కాగా, నిజామాబాద్లో 36, వరంగల్ అర్బన్లో 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఇప్పటికైతే తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్లో పేర్కొంది. ప్రతీ రోజూ చీఫ్ సెక్రటరీ అన్ని జిల్లాల ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు తెలిపారు. కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ లాక్ డౌన్ను పొడగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ పొడగించినా పొడగించకున్నా.. తెలంగాణలో మరికొన్ని వారాలు లాక్ డౌన్ పొడగించే అవకాశాలు లేకపోలేదు.
కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అటు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో కరోనా కోసం భారీ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. మరో 8 కరోనా ఆసుపత్రుల ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. కరోనా పేషెంట్ల చికిత్సకు ప్రధాన ఆసుపత్రిగా గాంధీనే కొనసాగించనున్నారు. కోటీశ్వరులైనా.. సామాన్యులైనా కరోనా సోకితే గాంధీ ఆసుపత్రిలోనే చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని ఇదివరకే స్పష్టం చేశారు.