ప్రయాణీకులపై లాఠీఛార్జ్.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తోపులాట.. ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్
హైదరాబాద్ : ప్రయాణీకులపై లాఠీలు లేచాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రభావం.. దసరా పండుగకు సొంత గ్రామాలకు పయనమైన నేపథ్యం.. వెరసి ప్రయాణీకుల వీపులపై లాఠీ దెబ్బలు పడ్డాయి. అటు బస్సులు లేక.. ప్రైవేట్ వాహన నిర్వాహకుల దోపిడీ తట్టుకోలేక సామాన్య ప్రయాణీకులు ఎక్కువగా రైళ్లపై ఆధారపడుతున్నారు. ఆ క్రమంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసి పోతోంది.
దసరా పండుగ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లేందుకు నగర వాసులు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఆర్టీసీ బస్సులు నడవక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యక్తులను డ్రైవర్లుగా నియమించి ఆర్టీసీ సంస్థ బస్సులు నడుపుతున్నా.. ఆశించిన స్థాయిలో సరిపోవడం లేదు. ఇక ప్రైవేట్ వాహనాలు నడిపేవారు అధిక ఛార్జీలు వసూలు చేస్తుండటంతో వాటిలో జర్నీ చేసేందుకు ప్రయాణీకులు సిద్ధపడటం లేదు. ఆ క్రమంలో ప్రత్యామ్నాయమైన రైళ్లపై ఆధారపడుతున్నారు. దాంతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ జనసంద్రంగా మారడంతో తోపులాట జరుగుతోంది.
ఆర్టీసీపై కుట్ర.. సమ్మెకు ప్రభుత్వమే కారణం.. కార్మిక జేఏసీ నిప్పులు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు భారీగా జనాలు క్యూ కడుతున్నారు. సొంత గ్రామాలకు వెళ్లేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వీపరీతమైన రద్దీతో రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ దారుణంగా తయారైంది. ఎటు చూసినా జనాలే కనిపిస్తున్నారు. దాంతో ఏ రైలు వచ్చినా తోపులాట తప్పడం లేదు. ఆ క్రమంలో ప్రయాణీకులను కంట్రోల్ చేయడానికి ఒకానొక దశలో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. క్యూ లైన్లో వెళ్లాలని పోలీసులు ఎంత చెప్పినా.. సొంతూళ్లకు చేరాలన్నా ఆత్రంతో ఎవరూ కూడా పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.