తెలంగాణకు భారీ పెట్టుబడులు... ప్రతిపాదనలతో కేటీఆర్ను కలిసిన ఆ రెండు కంపెనీలు..
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో రెండు సంస్థలు ముందుకొచ్చాయి. లారస్ ల్యాబ్స్,గ్రాన్యూల్స్ ఇండియా కంపెనీలు హైదరాబాద్లోని జినోమ్ వ్యాలీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ మేరకు ఈ రెండు కంపెనీల ప్రతినిధులు మంగళవారం(అక్టోబర్ 28) హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాష్ట్ర ఐటీ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ను కలిశారు.
ఈ సందర్భంగా రెండు కంపెనీల ప్రతినిధులు తమ ప్రతిపాదనలను కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. రెండు కంపెనీలు కలిపి రూ.700 కోట్లు జినోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇందులో రూ.400 కోట్లతో గ్రాన్యూల్స్ ఇండియా మాన్యుఫాక్చర్ యూనిట్తో పాటు రూ.300 కోట్లతో లారస్ ల్యాబ్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రికి వివరించారు. ఈ రెండు మాన్యుఫాక్చరింగ్ యూనిట్లతో కొత్తగా 1750 మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. ఆ రెండు కంపెనీల ప్రతిపాదనలను స్వాగతించిన కేటీఆర్... వారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు.
Recommended Video
హైదరాబాద్ శివారులోని శామీర్పేట్ సమీపంలో ఉన్న జినోమ్ వ్యాలీలో ఇప్పటికే పలు దిగ్గజ ఫార్మా సంస్థలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఫార్మా రంగం కోసం ఏర్పాటైన జినోమ్ వ్యాలీలో అనతికాలంలోనే పెద్ద పెద్ద సంస్థలు కొలువుదీరాయి. చెన్నై , బెంగళూరు వంటి నగరాలను పక్కకు నెట్టి దేశంలోని ప్రధాన సైన్స్ క్లస్టర్గా హైదరాబాద్లోని జీనోమ్ వ్యాలీ ఆవిర్భవించింది. ఇక్కడ ఉన్న 200 ప్రధాన ఫార్మాస్యూటికల్ హబ్స్లో 10,000 మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు.ప్రపంచవ్యాప్తంగా చిన్నపిల్లలకు సంబంధించిన వ్యాక్సిన్ డిమాండులో మూడింట ఒకవంతు ఇక్కడినుంచే ఉత్పత్తి అవుతోంది.