కేసీఆర్, కేటీఆర్ల పతనానికి నాంది అక్కడే: బీజేపీ భయం పట్టుకుందని ఏకిపారేసిన లక్ష్మణ్
హైదరాబాద్: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు భారతీయ జనతా పార్టీ అంటే భయమని.. అందుకే తమకు కాంగ్రెస్ పార్టీనే ప్రత్యర్థి అంటూ వ్యాఖ్యానిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీలో గెలిచిన బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థులతో ఆయన సమావేశం నిర్వహించారు.
కేసీఆర్, కేటీఆర్ పతనానికి నాంది..
ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ తుక్కుగూడ మున్సిపాలిటీ రాష్ట్ర రాజకీయాలను ఆలోచింపజేస్తోందన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ అక్రమంగా తుక్కుగూడ ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకుని ప్రజాభీష్టాన్ని టీఆర్ఎస్ అవమానించిందని మండిపడ్డారు. తుక్కుగూడ మున్సిపాలిటీ తీర్పు కేటీఆర్, కేసీఆర్ పతనానికి నాంది అని వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ నీచరాజకీయాలు
తుక్కుగూడ ఛైర్మన్ పదవి నైతికంగా బీజేపీదేనని.. అధికారం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరి నీచరాజకీయాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక కేసీఆర్, కేటీఆర్ ఎక్కడికక్కడ కార్యకర్తలను అణచివేస్తున్నారని లక్ష్మణ్ ధ్వజమెత్తారు.
బీజేపీ అంటే కేసీఆర్, కేటీఆర్లకు భయం..
అధికార పార్టీ బైంసా మున్సిపాలిటీలో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందని ఎద్దేవా చేశారు. బీజేపీ అంటే కేసీఆర్, కేటీఆర్లకు భయమని అందుకే తుక్కుగూడలో నీచ రాజకీయాలకు పాల్పడ్డారని లక్ష్మణ్ విమర్శించారు. దొడ్డిదారిన ఛైర్మన్ పదవి దక్కించుకున్నారని మండిప్డారు. గవర్నర్ను కలిసి అధికారపార్టీతీరుపై ఫిర్యాదు చేస్తామన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలే బీజేపీకి అతిపెద్ద బలమని లక్ష్మణ్ తెలిపారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు తగిన బుద్ది చెప్పారని అన్నారు. ఓవైసీ దోస్తి కోసమే సీఎం కేసీఆర్ సీఏఏను వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. సీఏఏను అడ్డుకోవడమంటే పాకిస్థానీ ముస్లింలకు మనదేశ పౌరసత్వం కోరడమేనని అన్నారు.
అధికార దుర్వినియోగమంటూ..
కాగా, ఇటీవల మున్సిపల్ ఎన్నికలపై లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ సర్కారు అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఓటర్ లిస్టు నమోదు నుంచి మొదలుకుంటే ఎన్నికల వరకు అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీజేపీ నేత లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ కూడా నిస్సహాయతను వ్యక్తం చేసిందన్నారు. ఇంత ఖరీదైన ఎన్నికలు ఎక్కడా చూడలేదని లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని లక్ష్మణ్ తెలిపారు. సొంతంగా 3 మున్సిపాలిటీల్లో గెలిచామని చెప్పారు. కొన్ని మున్సిపాలిటీల్లో అత్యధిక స్థానాలు సాధించామన్నారు. ఆమంగల్, తుక్కుగూడ, మక్తల్, నారాయణపేట్, మీర్ పేట్ర, నిజాంపేట్, నిజామాబాద్లో అధిక సీట్లు సాధించామన్నారు. రామంగుండంలో కీలకంగా ఉన్నట్లు లక్ష్మణ్ తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీ గెలిచామనుకుంటున్నారు.. ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీల ఓట్లతో గెలిచే పరిస్థితి ఉందన్నారు.