మరి కొద్ది గంటల్లో తేలనున్న నేతల భవితవ్యం..! అసదుద్దీన్ కి సోనియా ఫోన్..?
హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ నేతల భవితవ్వం ఈవియం యంత్రాల్లో బందీగా మారింది. కొన్ని గంటల తర్వాత మాత్రమే ఎవరి భవిత ఎలా 'నొక్కి' పెట్టి ఉందో చెప్పలేం..! అదికార ప్రతిపక్షాల మద్య కురుక్షేత్రంగా పరిణమించిన ఎన్నికల పోరులో అంతిమ విజయం ఎవరిదో తేలాలంటే మరికొద్ది గంటలు ఉత్కంఠగా ఎదురు చూడక తప్పేలా కనిపించం లేదు. మరో పక్క గెలుపుపై ధీమాగా ఉన్న కొంత మంది ముఖ్య నేతలు కలిసి వచ్చే పార్టీ ల మద్దత్తును కాంక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే సోనియా గాందీ ఎంఐఎం అదినేత అసద్దుద్దీన్ ఒవైసీకి ఫోన్ చేసి కూటమికి తమ పార్టీ మద్దత్తు కోరినట్టు తెలుస్తోంది.
రేపే బ్రంహ్మాండమైన విడుదల..! రాజకీయ తెరపై నేతల భవిత..!!
గడచిన నాలుగు రోజులుగా తెలంగాణ ప్రజలు, రాజకీయ పార్టీలు అనుభవిస్తున్న నరాలు తెగే ఉత్కంఠతకు రేపు తెరపడనుంది. ఈవీఎంలలో నిక్షిప్తమై ఉన్న నేతల తలరాతలు ఎలా ఉన్నాయో...? రానున్న ఐదేళ్ల పాటు తెలంగాణను ఎవరు పరిపాలించనున్నారో తేలేది రేపే. తెలంగాణ ఓటరు తీర్పు ఏమిటో మరో 24 గంటల్లో వెల్లడి కానుంది. డిసెంబర్ 7వ తేదీన జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సంబంధించి కౌటింగ్ ప్రక్రియ రేపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లను పూర్తి చేశారు. కౌంటింగ్ సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయ్యింది. 31 జిల్లల్లో కలిపి 44 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి కౌటింగ్ కేంద్రంలో 14 టేబుళ్లను ఏర్పాటు చేశారు.
ప్రతిపక్ష పార్టీల్లో టెన్షన్..!! ఈవీయం ల వద్ద కాపాలా కాస్తున్న కాంగ్రెస్ నేతలు..!
ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. పది గంటల ప్రాంతంలో తొలి ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. అయితే ఉదయం 8.30-9 గంటల నుంచే ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లవద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. ఇదిలా ఉండగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఈవీఎంలను ట్యాంపర్ చెయ్యడమో, మార్చడమో చేసే అవకాశం ఉందని, కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్ అగ్రనేతలు పిలుపు ఇవ్వడంతో కూటమి నేతలు రెండు రోజులుగా కౌటింగ్ కేంద్రాల వద్దే కాపలా కాయడం విశేషం..!
మహా కూటమిలోకి మజ్లీస్కు ఆహ్వానం..! ఒవైసీకి సోనియా ఫోన్ చేసినట్టు ప్రచారం..!!
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సంబంధించి కొన్ని గంటల్లో ఫలితాలు వెలువడనున్న సమయంలో రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా వేడెక్కుతున్నాయి. ప్రధాన పార్టీలకు ప్రభుత్వం ఏర్పాటుకు మెజార్టీ రాకుంటే ఎంఐఎం, బీజేపీ, ఇండిపెండెంట్లే కీలకం కానున్నారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎంఐఎంకు గాలం వేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ శనివారం మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీకి ఫోన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలని , ప్రభుత్వ ఏర్పాటుకు కలసి రావాలని ఆయనకు సోనియా ఆహ్వానం పలికినట్లు సమాచారం. చర్చలు జరిపేందుకు ఢిల్లీ రావాలని కోరినట్లుగా ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో చర్చజరుగుతోంది.
గులాబీ, కమలం స్నేహం..! ఎంఐఎం కి శరాఘాతం..!!
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎంఐఎం ఇక్కడ అధికార టీఆర్ఎస్కు బహిరంగ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలోని బీజేపీతో అంటకాగుతుండడం ఎంఐఎం నేతలకు నచ్చడం లేదు. ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రెండు పార్టీల సంబంధాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరో వైపు టీఆర్ఎస్కు తాము షరతులతో కూడిన మద్దతు ఇస్తామని బీజేపీ ఆదివారం ప్రకటించడం రాజకీయ కలకలం రేకెత్తించింది. ఈ పరిస్థితుల్లో ఎటు ఉండాలనేదానిపై మజ్లీస్ తేల్చుకోలేకపోతుంది. టీఆర్ఎస్కు నామమాత్రపు మెజార్టీ వస్తే మజ్లీస్తో పాటు బీజేపీ మద్దతు కూడా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని ఏమలుపు తిప్పుతుందో చూడాలి.