ఆరోగ్యశ్రీ సేవలకు లైన్ క్లియర్.. ప్రైవేట్ ఆసుపత్రుల సమ్మె విరమణ
హైదరాబాద్ : ఆరోగ్యశ్రీ సేవలు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. ప్రభుత్వం పాత బకాయిలు చెల్లించడం లేదంటూ సమ్మెకు దిగిన ప్రైవేట్ ఆసుపత్రులు మెట్టు దిగాయి. అయితే ఆరోగ్యశ్రీ ట్రస్టుతో ఆదివారం జరిగిన చర్చలు సఫలం కావడంతో సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించింది ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం.
ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులతో భేటీ అయిన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓ మాణిక్ రాజ్ ప్రజాప్రయోజనాల దృష్ట్యా సమ్మె విరమించాలని కోరారు. ఈ నాలుగైదు రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం అమలుకై 150 కోట్ల రూపాయల పాత బకాయిలను విడుదల చేశామని తెలిపారు. మిగిలిన బకాయిలు కూడా త్వరలోనే చెల్లిస్తామని చెప్పారు. దీంతో ప్రైవేట్ ఆసుపత్రుల సంఘం ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. సీఈఓ హామీతో రాష్ట్రమంతటా ఆరోగ్యశ్రీతో పాటు ఉద్యోగులు తదితరులకు ఇచ్చే ఆరోగ్య పథకాల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన 150 కోట్ల రూపాయలకు తోడు మరో 150 కోట్లు నెలరోజుల్లోగా విడుదల చేస్తామని, మిగిలిన బకాయిలు 2019 మార్చిలోగా చెల్లించేలా సీఈవో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సీఈఓ హామీతో పాటు రోగుల ఇబ్బందులను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించినట్లు తెలిపారు ప్రైవేట్ ఆసుప్రతుల సంఘం ప్రతినిధులు. నిధుల విడుదలకు సహకరించిన ఆపద్ధర్మ మంత్రి లక్ష్మారెడ్డితో పాటు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు.