లాక్ డౌన్ ఎఫెక్ట్... తెలంగాణలో బ్యాంకుల పని వేళల్లో మార్పు.. ఆ నాలుగు గంటలే...
తెలంగాణలో నేటి (మే 12) నుంచి లాక్డౌన్ అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. 10 రోజుల పాటు అమలవనున్న లాక్డౌన్ పీరియడ్లో ఉదయం 6గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే ప్రభుత్వం అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతినిచ్చింది. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్ల కోసం బ్యాంకులు తమ పని వేళల్లో మార్పులు చేశాయి.
లాక్డౌన్ పీరియడ్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కార్యకలాపాలు నిర్వహించాలని బ్యాంకులు నిర్ణయించాయి. ఈ నెల 20వ తేదీ వరకు ఈ పని వేళల్లోనే బ్యాంకుల కార్యకలాపాలు కొనసాగుతాయి. కేవలం 50శాతం సిబ్బందితో మాత్రమే బ్యాంకులను నిర్వహించనున్నారు.
కరోనా సెకండ్ వేవ్ ఉధృతి రీత్యా తెలంగాణలో ప్రభుత్వం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ రంగం, వైద్యరంగం,విద్యుత్,మీడియా,కోల్డ్ స్టోరేజీలు,గోడౌన్లు,వంటగ్యాస్,పెట్రోల్ బంకులకు ప్రభుత్వం లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఫార్మా రంగం,మెడికల్ షాపుల్లో పనిచేసేవారికి,ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక పాసులను జారీ చేస్తోంది. ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు మాత్రమే బస్సు సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి. జాతీయ రహదారులపై రవాణా యథావిధిగా కొనసాగనుంది.
లాక్డౌన్ మొదటిరోజైన బుధవారం(మే 12) రాష్ట్రంలో కొత్తగా 4723 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీలో 745 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మరో 5,695 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువగా ఉండటం గమనార్హం. గడిచిన 24 గంటల్లో మరో 31 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,11,711కి చేరింది.ఇప్పటివరకూ 2,834 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ 4,49,744 మంది కరోనా నుంచి కోలుకోగా... ప్రస్తుతం రాష్ట్రంలో 59,133 యాక్టివ్ కేసులున్నాయి.