లాక్ డౌన్ ఎఫెక్ట్ ... కేసుల విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
కరోనా వైరస్ తెలంగాణా రాష్ట్రాన్ని వణికిస్తుంది. అందుకే తెలంగాణా ప్రభుత్వం ప్రజలకు ఇది వ్యాప్తి చెందకుండా లాక్డౌన్ ప్రకటించింది. ఇలా దీంతో అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయినప్పటికీ కేసులు పెరుగుతున్న తీరు తెలంగాణా ప్రభుత్వాన్ని , అటు ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . ఇక ఈ తరుణంలో తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.
ఇప్పటికే కోర్టులో పెండింగ్ ఉన్న వివిధ కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును 3 నెలల పాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ నేపధ్యంలో కోర్టులు కూడా కార్యాకలాపాలు నిర్వర్తించటం లేదు. అత్యవసరం మినహాయించి మరేదీ పట్టించుకునే పరిస్థితి లేదు. కాబట్టి జూన్ 7వ తేదీ వరకు స్టే ఆర్డర్ల కొనసాగింపు ఉంటుందని పేర్కొంది హైకోర్టు. ఈ నెల 20తో ముగిసిన కేసుల్లో స్టే ఆర్డర్ల గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు. వివిధ కోర్టు కేసుల్లో కోర్టుకు హాజరు కావలసిన వారికి కూడా కోర్టు నిర్ణయం ఒకింత ఊరట. ఇక అంతేకాదు తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్డౌన్ను కూడా ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ప్రధాని మోడీ ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు హై కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో కోర్టులన్నీ ఏప్రిల్ 14 లేదా తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకూ లాక్డౌన్లో ఉంటాయని హైకోర్టు పేర్కొంది. అత్యవసర అంశాల కోసం న్యాయమూర్తులు, మేజిస్ట్రేట్లు రోటేషన్పై విధుల్లో ఉండాలని హైకోర్టు ఆదేశించింది. అత్యవసర పిటిషన్లను ఇ-మెయిల్ ద్వారా దాఖలు చేయాలని పేర్కొంది. న్యాయ శాఖ ఉద్యోగులు లాక్ డౌన్ పాటించాలని , ఇళ్లల్లోనే ఉండాలని కానీ అవసరం అయితే అందుబాటులో ఉండాలని సూచించింది. ఇక రిమాండ్, బెయిల్ లాంటి వాటిపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించాలని హైకోర్టు సూచించింది. స్కైప్ను కూడా వాడుకోవచ్చని పేర్కొంది హైకోర్టు .