లాక్డౌన్ వేళ హైదరాబాద్ టిక్టాక్ స్టార్ మీనల్ బిత్తిరి చర్య.. మంత్రి కేటీఆర్ను ట్యాగ్ చేసి..
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు లాక్డౌన్ను మరింత పకడ్బందీగా అమలుచేస్తున్నారు. అత్యవసరమైనాసరే, ఇంట్లో నుంచి అడుగు బయటపెడితే జనాన్ని ఇరగదీస్తున్నారు. అకారణంగా అమాయకులు దెబ్బలు తింటోన్న వీడయోలెన్నో వైరల్ అవుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో హైదరాబాద్ కు చెందిన టిక్ టాక్ స్టార్ ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే క్రేజీ వీడియో చేసి హల్ చల్ సృష్టించింది. రాజకీయ నాయకురాలైన ఆమె తల్లి.. సదరు వీడియోను ఏకంగా మంత్రి కేటీఆర్కు ట్యాగ్ చేసేసింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
మీనల్ మీనూ పేరుతో టిక్టాకర్ గా పాపులరైన ఈ యువతికి నాలుగు లక్షలపైచిలుకు ఫాలోవర్లు ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన ఆమె.. బుధవారంబర్త్ డే కావడంతో.. తానుండే మల్కాజ్ గిరి ప్రాంతానికి ఏదైనా మంచిచేయాలని అనుకుంది. కెమెరామెన్ తోడురాగా, బ్యాక్ డ్రౌండ్ లో 'హై వతన్' పాటతో.. నేరుగా మల్కాజ్ గిరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి, క్రిమిసంహారక మందులు పిచికారి చేసింది. కొద్ది నిమిషాలకే ఆ వీడియో వైరలైంది.
టీఆర్ఎస్ పార్టీలో నాయకురాలిగా ఉన్న మీనల్ తల్లి.. తన కూతురి వీడియోను మంత్రి కేటీఆర్ కు ట్విటర్ లో ట్యాగ్ చేసింది. 'సార్, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు. అందుకే ఈ మంచి పని చేసింది. తను సౌతిండియాలోనే ఎక్కువ ఫాలోవర్లున్న టిక్ టాకర్''అని రాసుకొచ్చింది. దీంతో వివాదం మరింత ముదిరింది. ఇంట్లో నుంచి బయటికి రావడానికి, పోలీస్ స్టేషన్ లో స్ప్రెయింగ్ చేయడానికి పర్మిషన్ తీసుకున్నారా? అనే ప్రశ్నలు వెల్లువెత్తాయి.
Recommended Video
మీనల్, ఆమె తల్లి చర్యలు వైరల్ కావడంతో వాటికి పోలీసులు సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. స్టేషన్ లో స్ప్రెయింగ్ చేయడానికి మీనల్ పర్మిషన్ తీసుకోలేదని, జీహెచ్ఎంసీకి చెందిన ఓ వర్కర్ నుంచి పురుగుమందులు పిచికారి చేసే సామాగ్రిని అడిగితీసుకుని వీడియో చేసిందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదుకాలేదని తెలిపారు. చివరికి మీనల్ ఆ వీడియోని, ఆమె తల్లి తన ట్వీట్ ను డిలిట్ చేయడంతో వివాదం సర్దుమణిగింది.