గద్వాలలో ఇళ్ళకు తాళాలు .. చైనా పద్దతిలో గృహ నిర్బంధాలు
తెలంగాణా రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి . దీంతో కరోనా కట్టడి కోసం జిల్లాల వారీగా ఎవరికి తోచిన విధానంలో కరోనా నియంత్రణా చర్యలను అనుసరిస్తున్నారు అధికార యంత్రాంగం . ఎవరు ఏ విధానం అనుసరించినా సరే అందరి లక్ష్యం ఒక్కటే కరోనా కట్టడి . ఇక తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా కట్టడికి అధికార యంత్రాంగం చైనా విధానం అమలు చేస్తుంది .
చైనాలోని వూహాన్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందినా సమయంలో వ్యాప్తి అరికట్టటం కోసం ప్రజలెవరూ బయటకు రాకుండా ఇళ్ళకు తాళాలు వేసి మరీ వారిని గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పుడు గద్వాల జిల్లాలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అధికారులు ఈ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఇక అక్కడ ప్రజలకు నిత్యావసరాలు కావాలంటే వారికి ఇంటికే సరఫరా చేస్తున్న పరిస్థితి ఉంది. నిత్యావసరాలు , కూరగాయలు అక్కడి ప్రజలు కాల్ చేసి చెప్తే ఇంటికే తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఇక వారు బయటకు రాకుండా మాత్రం ఇంటికి తాళాలు వేస్తున్నారు .
కరోనా వైరస్ ప్రభావం ఉన్న రెడ్ జోన్ ల పరిధిలో కూడా ప్రజలను కట్టడి చెయ్యటం ఇబ్బందిగా మారుతున్న తరుణంలో ఇక ఇళ్ళ నుండి ప్రజలు బయటకు రాకుండా ఈ నిర్ణయం తీసుకున్న అధికారులు ఇళ్ళకు తాళాలు వేస్తున్నారు. గద్వాల మున్సిపాలిటీ పరిధిలో చాలా ప్రాంతాల్లో ఇదే విధానం అమలు చేస్తున్నారు. ఏది ఏమైనా కట్టడికి అధికార యంత్రాంగం చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు ఇబ్బందికరంగా అనిపించినా కరోనా కట్టడికి మాత్రం ఇలాంటి నిర్ణయాలు తీసుకోక తప్పటం లేదని అంటున్నారు అధికారులు .