షెడ్యూల్, పోలింగ్ రెండు దుర్ముహూర్తాల్లోనేనా? ఎవరికి లాభం?.. ఎవరికి నష్టం?
హైదరాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన క్షణం శుభసూచకమేనా? జ్యోతిషంతో పాటు శాస్త్రాలను అనుసరించే తెలుగు రాష్ట్రాల నేతలు ఆ ముహుర్తం చూసి భయపడుతున్నారా? ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయంపై దక్షిణాది రాష్ట్రాల నేతలు అనుమానాలు పెట్టుకున్నారా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకే ఒక్క సమాధానం కనిపిస్తోంది. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది రాహుకాలంలో కావడం.. కొంతమంది నేతలకు గుబులు పుట్టిస్తోంది.
రాహుకాలంలో షెడ్యూల్ ప్రకటన
తెలుగు ప్రజలు జ్యోతిషంతో పాటు వివిధ శాస్త్రాలను అనుసరిస్తారు. వాటి ప్రకారమే ముహుర్తాలు చూసుకుంటూ ఏ పనైనా తలపెడతారు. అలా తెలుగు రాష్ట్రాల నేతలకు కూడా శాస్త్రాలపై గురి ఎక్కువే. అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు జ్యోతిషాన్ని ప్రగాఢంగా విశ్వసిస్తారు.
తలపెట్టే ప్రతి పనిలోనూ ముహుర్తబలం చూసుకున్నాకే ముందుకెళతారు. వారిద్దరే కాదు ఎంతోమంది నేతలు అదే ఫాలో అవుతారు. అయితే అంతలా జ్యోతిషాన్ని నమ్మే నేతలకు లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సమయం ఇప్పుడు సవాల్ గా మారింది. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి 6 గంటల వరకు రాహుకాలం ఉంది. అయితే 5 గంటల సమయంలో ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేయడం గమనార్హం.
పోటీకి 75 ఏళ్లు కటాఫా?.. యువతకు ఛాన్సుందా?.. బీజేపీ మర్మమేంటో?
నేతల్లో గుబులు
కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న జేడీఎస్ నేతలు సైతం ముహుర్తాలను బలంగా విశ్వసిస్తారనే పేరుంది.
దక్షిణాది రాష్ట్రాల్లోని ఆయా పార్టీల నేతలకు జ్యోతిషంపై గురి ఉందనేది ఓ అంచనా. దాంతో తాజాగా లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సందర్భానుసారం వారు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
అదలావుంటే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై ఓ టీఆర్ఎస్ నేత మాట్లాడిన తీరు మరోలా ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మంచి ముహుర్తంలో కాదు, అలాగే అమావాస్య రోజు పోలింగ్ జరిగింది. అయినా కూడా గులాబీ జెండా రెపరెపలాడింది కదా అని వ్యాఖ్యానించడం పాజిటివ్ థింకింగ్ దృక్పథంగా కనిపిస్తోంది. అంటే ఎన్నికలకు జ్యోతిషం, ముహుర్తబలం, రాహుకాలం అలాంటివేమీ వర్తించవనే చందాన ఆయన మాట్లాడినట్లు అర్థమవుతుంది. ఏదైనా కూడా ఆయా వ్యక్తులకు సంబంధించి మాత్రమే ఫలితాలు వస్తాయనేది ఆయన అంతరం కావొచ్చు.
పోలింగ్ నాడు ప్రతికూలతలే ఎక్కువ
లోక్సభ ఎన్నికలు తొలిదశ ఏప్రిల్ 11న జరగనున్నాయి. పోలింగ్ ఉదయం 7 గంటలకు షురూ కానుంది. అయితే ఉదయం 6 గంటల 7 నిమిషాల నుంచి 7 గంటల 39 నిమిషాల వరకు యమగండం ఉండటం గమనార్హం. మళ్లీ 9 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 44 వరకు గుళిక కాలం కొనసాగుతుంది. అనంతరం ఒంటిగంట 49 నిమిషాలకు రాహుకాలం ప్రారంభమవుతుంది. అది 3 గంటల 22 నిమిషాల వరకు ఉండనుంది. సాయంత్రం మరో 2 గంటల పాటు వర్జ్యం కూడా ఉంది. ఇన్నీ ప్రతికూలతలు ఉన్న ఆ రోజు.. తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ జరుగుతుండటం కొందరు నేతల్ని నిరాశకు గురిచేస్తోంది.