లోక్సభ సమరం.. నేటి నుంచే నామినేషన్ల పర్వం
హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల సమరానికి సమయం దగ్గరపడుతోంది. వచ్చే నెల 11వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో నామినేషన్ల పర్వానికి తెరలేచింది. 18.03.2019 (సోమవారం ) నుంచి 25.03.2019 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు ఎన్నికల అధికారులు. నామినేషన్ల దాఖలుకు దాదాపు 8 రోజులు సమయమిచ్చినా.. అందులో 2 రోజులు సెలవులు రావడం గమనార్హం.
ఎన్నికల పోరు
లోక్సభ ఎన్నికల పోరుకు సర్వం సిద్ధమైంది. తొలి ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సంఘం. మార్చి 18 నుంచి 25 వరకు నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. మార్చి 26న పరిశీలన ఉంటుంది. మార్చి 27, 28 తేదీల్లో ఉపసంహరణకు అవకాశమిచ్చారు. ఏప్రిల్ 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. మే 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.
తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి లక్షా 85 వేల 560 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. మొత్తం 94 వేల 991 ఈవీఎంలతో పాటు 41 వేల 356 వీవీ ప్యాట్స్ వినియోగించనున్నారు. దాదాపు 270 ప్లాటూన్ల కేంద్ర బలగాలు రాష్ట్రానికి రానున్నాయి.
ఆ రెండు రోజులు..!
మార్చి 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశమిచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. ఈ లెక్కన దాదాపు 8 రోజులు నామినేషన్లు వేయడానికి ఛాన్సున్నా.. అందులో 2 రోజులు హాలిడేస్ కావడం గమనార్హం. మార్చి 21న హోలీ పండుగతో పాటు మార్చి 24వ తేదీ ఆదివారం కావడంతో ఆ రెండు రోజులు నామినేషన్ల స్వీకరణ లేనట్లే.
కాంగ్రెస్లో గందరగోళం: టిక్కెట్ దక్కలేదని పార్టీని వీడుతున్న నేతలు, లిస్ట్లో రమ్య కూడా!
పకడ్బందీగా ఎన్నికలు..!
లోక్సభ ఎన్నికల నిర్వహణను పకడ్బందీగా నిర్వహించేలా కసరత్తు చేస్తోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. 17 సెగ్మెంట్లకు జరుగుతున్న ఎలక్షన్ల కోసం రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అంతా కలిపి దాదాపు 2 లక్షల 50 వేల మంది సిబ్బంది ఎలక్షన్ డ్యూటీలో పాలుపంచుకోనున్నారు.
2019, జనవరి 1వ తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితా ప్రకారం 2 కోట్ల 95 లక్షల మంది ఓటర్లుగా నమోదై ఉన్నారు. అయితే కొత్తగా ఓటు నమోదు చేసుకోవడానికి మార్చి 15వ తేదీతో గడువు ముగిసింది. మొత్తానికి మార్పులు చేర్పులతో కొత్త ఓటర్ లిస్టును మార్చి 25వ తేదీన ప్రకటించనున్నారు ఈసీ అధికారులు. అయితే మరో 3 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదయ్యే ఛాన్స్ ఉన్నట్లు ఒక అంచనా.
స్థానాలు 17.. అభ్యర్థులు ఎంతమందో?
17 లోక్సభ స్థానాలకు గాను ఎంతమంది అభ్యర్థులు బరిలో నిలుస్తారనేది చర్చానీయాంశంగా మారింది. ప్రధాన పార్టీల అభ్యర్థులకు తోడు చిన్నా చితకా పార్టీలకు చెందిన నేతలు, అలాగే స్వతంత్ర అభ్యర్థులు ఈసారి పెద్దసంఖ్యలో పోటీచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
2014 నాటి లోక్సభ ఎన్నికలు పరిశీలించినట్లయితే.. 17 సెగ్మెంట్లకు గాను 347 మంది అభ్యర్థులు తలపడ్డారు. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ తర్వాత 265 మంది బరిలో నిలిచారు. అయితే అందులో అత్యధికంగా 223 మంది అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. గెలవలేమని తెలిసినప్పటికీ కొంతమంది తమ ఉనికి చాటుకోవడం కోసం నామినేషన్లు వేస్తుంటే.. ఒక్కసారైనా అలా పోటీచేసినట్లుందనే భావనతో పోటీకి సై అంటున్నారు మరికొందరు. మొత్తానికి ఈసారి ఎంతమంది బరిలో నిలుస్తారో చూడాలి.