లోకసభ ఎన్నికలు 2019: హైదరాబాద్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
Recommended Video
తెలంగాణ రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలలో హైదరాబాద్ నియోజకవర్గం ప్రత్యేకమైనది. 2014 ఏపీ విభజనకు ముందు సమైక్య ఏపీలోని 42 నియోజకవర్గాలలోను ఇది ప్రత్యేకమైనదే. ప్రస్తుతం (2014-2019) హైదరాబాద్ ఎంపీగా మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఆయన గత మూడు పర్యాయాలుగా వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. అంతకుముందు ఆరు పర్యాయాలు ఆయన తండ్రి సలాలుద్దీన్ ఓవైసీ ఎంపీగా ఉన్నారు.
1951 నుంచి వరుసగా నాలుగు పర్యాయాలు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో 1971 నుంచి 1977 వరకు తెలంగాణ ప్రజా సమితికి చెందిన గోపాలయ్య సుబ్బుకృష్ణ మెల్కొటే ప్రాతినిథ్యం వహించారు. అంతకుముందు రెండుసార్లు ఆయన కాంగ్రెస్ నుంచే ప్రాతినిథ్యం వహించగా, ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఆయన తెలంగాణ ప్రజా సమితి నుంచి పోటీ చేసి గెలిచారు.
ఆ తర్వాత రెండుసార్లు కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత 1984లో నుంచి మజ్లిస్ పార్టీయే ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తోంది. నాడు సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ స్వతంత్ర్య అభ్యర్థిగా గెలిచారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999లలో మజ్లిస్ పార్టీ నుంచి సలాహుద్దీన్ విజయం సాధించారు. 2004 నుంచి ఆయన తనయుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
ఇక్కడ మజ్లిస్ పార్టీకి ధీటుగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నిలుస్తోంది. మైనార్టీలు చాలా అధికంగా ఉండే హైదరాబాద్ లోక్సభ పరిధిలో 1999లో మజ్లిస్ సుల్తాన్ సలాహుద్దీన్కు 4,48,165 ఓట్లు రాగా, బీజేపీ నుంచి బద్దం బాల్రెడ్డి గట్టి పోటీ (3,87,344 ఓట్లు) ఇచ్చారు. 2004లో అసదుద్దీన్కు బీజేపీ సుబాష్ చందర్జీ గట్టి పోటీ ఇచ్చారు. 2014లో అసదుద్దీన్పై బీజేపీ భగవంత్ రావు పోటీ చేశారు. ఇక్కడ మజ్లిస్, బీజేపీలకు బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఆ తర్వాత ఇతర పార్టీలు బీజేపీ ఓటు బ్యాంకు చీలిపోయేలా అభ్యర్థులను నిలబెట్టడం మజ్లిస్ పార్టీకి మరింత కలిసి వస్తోంది.
2014లో హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం నుంచి 17 మంది అభ్యర్థులు నామినేషన్ వేయగా, ఒకరిది తిరస్కరించబడింది. మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ తమ సమీప అభ్యర్థి భగవంత్ రావు పైన 2 లక్షల పై చిలుకు మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ నుంచి కృష్ణా రెడ్డి, టీఆర్ఎస్ నుంచి రషీద్, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి బింగి రాజశేఖర్, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సర్వత్, ఎస్పీ నుంచి జయ వింధ్యాల, వైసీపీ నుంచి సాయినాథ్ రెడ్డి.. ఇలా పదహారుమంది బరిలో నిలిచారు.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో మలక్పేట, కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్పుర, బహదూర్పురా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 18,23,217 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి నుంచి మజ్లిస్ పార్టీ ఎక్కువసార్లు గెలిచింది.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలోను ఓ ప్రత్యేకత ఉంది. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను ఆరింట మజ్లిస్ విజయం సాధించగా, గోషామహల్ మాత్రం బీజేపీ గెలిచింది. కార్వాన్, గోషామహల్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకూత్పుర, బహదూర్పురాల నుంచి మజ్లిస్ అభ్యర్థులు విజయం సాధించారు. గోషామహల్ నుంచి 2014లో, 2018లో బీజేపీ నుంచి రాజాసింగ్ లోథ్ గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖేష్ గౌడ్ విజయం సాధించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009కు ముందు ఈ నియోజకవర్గం వచ్చింది.
ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మలక్పేట నుంచి అహ్మద్ బలాలా, కార్వాన్ నుంచి కౌజల్ మోహియుద్దీన్, గోషామహల్ నుంచి రాజాసింగ్ లోథ్, చార్మినార్ నుంచి ముంతాజ్ అహ్మద్ ఖాన్, చాంద్రాయణగుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ, యాకూత్పురా నుంచి అహ్మద్ పాషాఖాద్రి, బహదూర్ పురా నుంచి మహ్మద్ మౌజంఖాన్లు గెలిచారు.
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 65 శాతానికి పైగా మైనార్టీలు ఉన్నారు. ఇక్కడి నుంచి వెంకయ్య నాయుడు కూడా ఓసారి పోటీ చేశారు. ఆయన 1996లో సుల్తాన్ సలాహుద్దీన్ ఓవైసీ పైన పోటీ చేసి 73వేల మెజార్టీతో ఓడిపోయారు.
ఇక్కడి నుంచి 2014లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి భగవంత్ రావు పైన మజ్లిస్ పార్టీ అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ 3 లక్షలకు పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు. అసదుద్దీన్కు 6 లక్షల పై చిలుకు ఓట్లు రాగా, భగవంత్ రావుకు 3 లక్షల పై చిలుకు ఓట్లు వచ్చాయి. 2004 నుంచి అసదుద్దీన్ ఎంపీగా ఉన్నారు. 2009లో మాత్రం మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్కు టీడీపీ అభ్యర్థి జహీద్ అలీఖాన్ గట్టి పోటీ ఇచ్చారు. అప్పుడు తెరాస, టీడీపీ మహాకూటమిగా పోటీ చేశాయి. అప్పుడు అసదుద్దీన్ లక్షకు పైగా మెజార్టీతో గెలిచారు.
మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం వెనుకబడిందనే వాదనలు ఉన్నాయి. ఇక్కడి పేద ముస్లీం కుటుంబాలు దుబాయ్ షేక్లకు తమ ఆడపిల్లలను అమ్మివేస్తుంటాయి. ఉగ్ర మూలాలు ఉంటాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి.