15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. శంషాబాద్ ఎయిర్పోర్టు మిస్సింగ్ కేసులో యువకుడి డ్రామా..!
హైదరాబాద్ : ఒక తప్పు చేశాడు. అది కప్పి పుచ్చుకునేందుకు మరో తప్పు చేశాడు. చివరకు కిడ్నాప్ డ్రామా ఆడాడు. కుటుంబ సభ్యులను నమ్మించి నాటకం ఆడాడు. అయితే విషయం కాస్తా పోలీసుల దగ్గరకు వెళ్లడంతో పప్పులు ఉడకలేదు. చేసిన నిర్వాకం కాస్తా బయట పడింది. బంధుమిత్రుల దగ్గర పరువు పోయింది. మల్కాజిగిరికి చెందిన ఓ ఎన్ఆర్ఐ ఆడిన డ్రామా చివరకు తప్పులో కాలేసినట్లైంది. లండన్ వెళ్లానంటూ ఫోజులు కొట్టి ఇండియాలోనే ఉంటూ తిరుగు ప్రయాణంలో కిడ్నాప్ జరిగిందంటూ నాటకాలాడి అడ్డంగా దొరికిపోయిన ఘటన చర్చానీయాంశంగా మారింది. శంషాబాద్ విమానాశ్రయంలో వ్యక్తి అదృశ్యమయ్యాడనే వార్త అలజడి రేపినా.. చివరకు అదంతా బూటకమని తేలిపోయింది.
లండన్ నుంచి వచ్చానంటూ ఎన్ఆర్ఐ డ్రామా.. చివరకు..!
శంషాబాద్ విమానాశ్రయంలో యువకుడి అదృశ్యం కేసు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. మల్కాజిగిరికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తి లండన్ నుంచి హైదరాబాద్కు చేరుకుని ఇంటికెళ్లే క్రమంలో తనపై దాడి జరిగిందని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడు. అంతేకాదు తన దగ్గరున్న 2 లక్షల రూపాయల యూకే కరెన్సీతో పాటు బంగారు ఆభరణాలు దుండగులు దోచుకెళ్లారని కట్టుకథ అల్లాడు. తనను ఎక్కడో నిర్మానుష్య ప్రదేశంలో వదిలి వెళ్లిపోయారని ఏదేదో చెప్పాడు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వాళ్లు ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి.
అదలావుంటే అదంతా డ్రామా అని తేల్చి పారేశారు పోలీసులు. ప్రవీణ్ నాటకం ఆడాడని స్పష్టం చేశారు. తీగ లాగితే డొంక కదిలిన చందంగా ప్రవీణ్ వేసిన ప్లాన్ చివరకు బెడిసి కొట్టింది. ఎన్ఆర్ఐ అదృశ్యమయ్యాడనే వార్త దావానంలో వ్యాపించడంతో పోలీసులు సీరియస్గా తీసుకుని 24 గంటల్లోగా కేసు చేధించారు.
జై జై గణేశా.. బై బై గణేశా.. మూడో రోజు నుంచే నిమజ్జనం.. భారీ బందోబస్తు..!
24 గంటల్లో కేసు చేధించిన పోలీసులు
శంషాబాద్ విమానాశ్రయంలో లండన్ నుంచి వచ్చిన వ్యక్తి అదృశ్యమయ్యాడనే వార్త కలకలం రేపింది. అయితే పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు చేయగా 24 గంటల వ్యవధిలోనే అనూహ్య మలుపు తిరిగింది. అది మిస్సింగ్ కేసు కాదు.. కిడ్నాప్ కేసు అంతకన్నా కాదని తేల్చేశారు. అదంతా ప్రవీణ్ ఆడిన నాటకంగా తేల్చి పారేశారు.
మంగళవారం నాడు రాత్రి తాను లండన్ నుంచి వచ్చినట్లు తల్లిదండ్రులను నమ్మించే ప్రయత్నం చేశాడు ప్రవీణ్. అయితే అతను నాటకం ఆడినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు.
15 రోజుల్లో పెళ్లి.. లండన్ పోలేదు.. ఇక్కడే ఉండి డ్రామా..!
మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన ప్రవీణ్ కొంతకాలంగా లండన్లో ఉన్నాడు. అయితే గతేడాది ఇంటికి చేరుకున్న ప్రవీణ్ తిరిగి లండన్ వెళ్లినట్లు కుటుంబ సభ్యులను నమ్మించాడు. కానీ అతడు లండన్ వెళ్లకుండా ఇండియాలోనే ఉంటున్నాడు. అయితే 15 రోజుల్లో పెళ్లి జరగనుండటంతో లండన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చినట్లు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
అయితే ఇంటికొచ్చే క్రమంలో దుండగులు తన దగ్గర నుంచి డబ్బు, గోల్డ్ కొట్టేశారని డ్రామా ఆడాడు. దాదాపు ఏడాది కాలంగా లండన్ వెళ్లకుండా ఇండియాలోనే ఉంటున్న ప్రవీణ్.. ఉట్టి చేతులతో వస్తే అనుమానం వస్తుందని ఇలా నాటకం ఆడాడనే వాదనలు వినిపిస్తున్నాయి.