ప్రేమ కలిపింది.. అదే ప్రాణం తీసింది.. ఆ యువతి ఇక దక్కదని..!
హైదరాబాద్ : ఆ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. నాలుగేళ్లుగా కలిసి తిరిగారు. స్కూల్ ఏజ్లోనే ముదిరిన వారి ప్రేమ.. కాలేజీ చదువుకు వచ్చేసరికి దూరమైంది. చిన్న చిన్న కారణాలతో ఆ యువతి తనను పక్కన పెడుతోందని భావించిన సదరు యువకుడు చివరకు ప్రాణాలు విడిచాడు. హైదరాబాద్లో జరిగిన ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది.
బంజారాహిల్స్ ప్రాంతంలోని ఫిల్మ్ నగర్ ఎంఆర్సీ కాలనీకి చెందిన 20 సంవత్సరాల అభిషేక్ పాండే ప్రస్తుతం డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అయితే వరుసకు దూరపు బంధువయ్యే 19 సంవత్సరాల యువతితో నాలుగేళ్ల కిందట ప్రేమలో పడ్డాడు. ఆ యువతి కూడా ప్రస్తుతం డిగ్రీ చదువుతోంది. అయితే మైనర్లుగా ఉన్నప్పుడే వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. ఆ క్రమంలో నాలుగేళ్లు ప్రేమ పక్షుల్లా తిరిగారు.
ఖమ్మం ఆర్టీసీ డ్రైవర్ మృతి.. కార్మికులు గరం గరం.. 14 నాడు జిల్లా బంద్
నాలుగేళ్లుగా కొనసాగిన వారి ప్రేమకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సినిమాలకు, షికార్లకు తిరిగారు. అయితే అకస్మాత్తుగా రెండు నెలల కిందట వీరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. చిన్న చిన్న కారణాలతో బ్రేకప్ దాకా వచ్చింది పరిస్థితి. తనతో ఇక మాట్లాడొద్దంటూ ఆ యువతి ఖరాఖండిగా చెప్పేసింది. దాంతో సదరు యువకుడు మనస్థాపానికి గురయ్యాడు.
రెండు నెలలుగా తనతో మాట్లాడకపోవడం.. కనీసం మేసేజ్లకు కూడా స్పందించకపోవడంతో ఆ యువకుడు చనిపోవాలని డిసైడయ్యాడు. ఆ క్రమంలో విషయం చెబుతూ ఆ యువతికి మేసేజ్ పంపించాడు. తాను చనిపోతున్నానంటూ సమాచారం ఇచ్చాడు. అయినా ఆమె స్పందించలేదు. దాంతో ఇక సెలవంటూ మరో మేసేజ్ పెట్టి ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. అయితే తన కొడుకు మృతికి సదరు యువతి కారణమంటూ అతడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.