ప్రేమికులారా, అటువైపు వెళ్లొద్దు.. ఆ పార్కులో ఇక నో ఎంట్రీ..!
హైదరాబాద్ : ఏ పార్కులో చూసిన ఏమున్నది గర్వకారణం.. సమస్తం ప్రేమ పక్షుల నిలయం అన్న చందంగా తయారైంది పరిస్థితి. నగరంలో పార్కులకు కొదువ లేదు. అలాగని ప్రేమ జంటలకూ కూడా కొదువ లేదు. అలసి సొలసి కాసింత సేద తీరుదామని పార్కులకు వెళ్లే సగటు నగర జీవికి ఎంత కష్టం కష్టం.. ప్రేమ జంటల రూపంలో ప్రకృతిని ఆస్వాదించడానికి కూడా వీలు లేకుండా పోతోంది.
హైదరాబాద్ పార్కులంటే కొందరు భయపడతారు. కుటుంబ సమేతంగా వెళ్లాలంటే జంకుతారు. ఏ పార్కుకు వెళ్లినా ఫ్యామిలీల కంటే ప్రేమపక్షులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అదే కోవలో హుస్సేన్ సాగర్ తీరంలోని సంజీవయ్య పార్కు.. లవ్ బర్డ్స్కు కేరాఫ్ అడ్రస్గా మారింది. చెట్టుకో జంట చొప్పున అదో మైకంలో మునిగి తేలుతున్న సన్నివేశాలు కనిపిస్తుంటాయి. అయితే ఇకపై అలా కుదరదంటూ అధికారులు తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది.
92 ఎకరాల్లో సువిశాలమైన పార్క్.. ఇన్నాళ్లు అలా.. ఇకపై కుదరదుగా..!
హైదరాబాద్లోని హుస్సేన్ సాగర్ తీరాన గల సంజీవయ్య పార్క్ 92 ఎకరాల్లో విస్తరించి నగరానికి మణిహారంలా నిలుస్తోంది. అయితే ఈ పార్క్ ప్రేమ పక్షులకు ఆవాసంగా మారిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఎన్నిసార్లు అధికారులు దాడులు చేసి లవ్ బర్డ్స్కు కౌన్సెలింగ్ నిర్వహించినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. చెట్టుకో జంట చొప్పున కూర్చుని.. లోకంతో తమకేమీ సంబంధం లేనట్లుగా పిచ్చి చేష్టలతో తమదైన మరో లోకంలో విహరిస్తుంటారు.
చివరకు సంజీవయ్య పార్కు అనేది.. ప్రేమ జంటలకు తప్ప నగరవాసులకు ఏ మాత్రం పనికిరాదనే విధంగా తయారైంది పరిస్థితి. వారాంతాల్లో సరదాగా ఫ్యామిలీతో వెళ్లి ప్రకృతి ఒడిలో సేద తీరుదామనుకునే వారికి నిరాశే మిగులుతోంది. నిజమైన ప్రేమికులో కాదో కూడా తెలియకుండా జంటలకొద్దీ సంజీవయ్య పార్కుకు వచ్చి జుగుప్సకరంగా వ్యవహరిస్తుంటారు. ఫ్యామిలీతో వచ్చే వారు ఆ జంటలను చూసి ఇబ్బందిగా ఫీలవుతుంటారు.
మైనర్ బాలికలతో ఆడుకుంటున్న మరో రెడ్డి.. జడ్చర్లలో టెన్త్ క్లాస్ విద్యార్థిని దారుణ హత్య..!
ప్రేమపక్షులకు, రొమాన్స్ జంటలకు ఇక నో ఛాన్స్
సంజీవయ్య పార్కుకు వచ్చే ప్రేమ పక్షులు గానీ, రొమాన్స్ జంటలు గానీ తమను తాము మరిచిపోతూ అదో లోకంలో విహరిస్తుంటారు. తమను ఇతరులు గమనిస్తున్నారనే ఇంగీత జ్ఞానం లేకుండా రెచ్చిపోతుంటారు. అయితే ఇకపై అలాంటి ప్రేమ పక్షులకు ఛాన్స్ లేదంటున్నారు హెచ్ఎండీఎ అధికారులు. లవ్ బర్డ్స్ గానీ జంటలకు గానీ ఇకపై అనుమతి లేదని ప్రకటించారు. సంజీవయ్య పార్కును ఇకపై పిల్లల పార్క్గా మార్చేశారు.
పిల్లలతో వచ్చే ఫ్యామిలీలకు మాత్రమే గురువారం నుంచి అనుమతిస్తామని స్పష్టం చేశారు. ఉదయం 5.30 నుంచి 8.30 గంటల వరకు నడక కోసం, వ్యాయామం కోసం వచ్చే వారికి మాత్రం ఎప్పటిలాగే ఉచిత ప్రవేశం ఉంటుందన్నారు. పిల్లల కోసం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పార్క్ తెరిచి ఉంటుందని తెలిపారు.
ఇక పిల్లల కోసమే.. ఎంజాయ్ చిల్డ్రన్స్
సంజీవయ్య పార్కుతో పాటు రోజ్ గార్డెన్, హర్బల్ పార్క్, బటర్ ఫ్లై పార్క్ తో పాటు జాతీయ జెండా ఉన్న ప్రాంతం కలిపి పిల్లల ఉద్యానవనంగా మార్చినట్లు హెచ్ఎండీఏ కార్యదర్శి ఎం.రాంకిషన్ ప్రకటించారు. గురువారం (29.08.2019) నుంచే సంజీవయ్య పార్క్ పిల్లల ఉద్యావనంగా మార్చినట్లు చెప్పారు. అయితే ఇకపై సంజీవయ్య పార్క్లో ఎంట్రీ దొరకాలంటే కొన్ని కండిషన్స్ పెట్టారు. పధ్నాలుగు ఏళ్ల లోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులను మాత్రమే ఇకపై పార్కులోకి అనుమతించనున్నారు.
పిల్లలు లేకుండా వచ్చే 14 ఏళ్ల వయసు మించినోళ్లకు నో ఎంట్రీ అంటూ నిబంధనలు విధించారు. అయితే ఇదివరకు పార్కులోకి ప్రవేశించాలంటే ఎంట్రీ ఫీజు 20 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు పిల్లల ఉద్యానవనంగా మార్చాక ఎంట్రీ టికెట్ ధరను 10 రూపాయలకు తగ్గించారు. అదలావుంటే పిక్నిక్ స్పాట్గా స్కూళ్ల నుంచి వచ్చే విద్యార్థులకు ఎంట్రీ ఫీజు ఎత్తేశారు. టీచర్లతో కలిసి బృందాలుగా వచ్చే స్కూల్ పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
పిక్నిక్ టూర్గా తీర్చిదిద్దేలా ప్లాన్.. స్కూల్ విద్యార్థుల బృందాలకు నో టికెట్..!
ఇన్నాళ్లు సంజీవయ్య పార్క్ అంటే అదో ముద్ర పడింది. కేవలం ప్రేమ పక్షుల కోసమే అన్నట్లుగా ఉన్న ఈ పార్క్ ఇప్పుడు కొత్త రూపం సంతరించుకోనుంది. పిల్లల ఉద్యానవనంగా మార్చడమే గాకుండా సైన్స్ పట్ల పిల్లల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగేలా ఈ పార్క్ను తీర్చిదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంతేకాదు పాఠశాల విద్యార్థులు పిక్నిక్ టూర్గా ఇక్కడకు రావడానికి వీలుగా తగిన ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అదలావుంటే పార్కులో పొగ తాగడం, మద్యపానం ఇకపై కుదరదు. పార్క్ వాతావరణం కలుషితం చేయకుండా బయటి తినుబండారాలను సైతం లోనికి అనుమతించకుండా గట్టి చర్యలు చేపట్టబోతున్నారు.