హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబు
Recommended Video
మేడ్చల్ : మహాశివరాత్రి పురస్కరించుకుని మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట ఆలయం ముస్తాబైంది. ఆధ్యాత్మిక శోభతో భక్తులను ఆకట్టుకునేందుకు రెడీ అయింది. శనివారం (02.03.2019) నుంచి గురువారం (07.03.2019) వరకు నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న ఈ వేడుకలను పకడ్బందీగా నిర్వహించడానికి సన్నద్ధమైంది. 22 జాతర కమిటీలను ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టర్.. పనుల పర్యవేక్షణలో నిమగ్నమయ్యారు.
ముస్తాబైన కీసర.. ఏర్పాట్లు ఘనం
మహాశివరాత్రి సందర్భంగా కీసరగుట్ట ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆరు రోజుల పాటు జరిగే వేడుకల్లో భక్తులకు ఇబ్బందులు కలగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. 1400 మంది పంచాయతీ సిబ్బందికి వివిధ పనులు అప్పగించారు. మూడు షిఫ్టుల్లో వీరంతా పనిచేయనున్నారు. ఒక్కో షిఫ్టులో దాదాపు 400 మందికి పైగా విధులు నిర్వర్తించనున్నారు.
మరోవైపు కీసరగుట్ట బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల నిఘాతో అనుక్షణం భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు. ఇప్పటికే రెండుసార్లు జాతర సమీక్షా సమావేశాలు నిర్వహించిన జిల్లా కలెక్టర్.. సంబంధింత అధికారులకు దిశానిర్దేశం చేశారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. ఆరు రోజుల పాటు అందరూ గుట్టపైనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
నిఘా నేత్రాలు.. భారీ బందోబస్తు
శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆరు రోజుల పాటు జరగనున్న మహా జాతరకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. 1500 మంది పోలీసులు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు. షీ టీమ్స్, ఎస్ఓటీ టీమ్స్ నిరంతరం పర్యవేక్షించనున్నాయి. మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అక్కడ బందోబస్తులో భాగంగా మహిళా పోలీసుల్ని నియమించనున్నారు.
మహా జాతర.. కీసర వయా ఈసీఐల్
శివరాత్రి (04.03.2019) పర్వదినాన దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు వస్తారనేది ఒక అంచనా. ఆ మేరకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రెండు ధర్మదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేశారు. అలాగే 200, 400, 800 రూపాయల డినామినేషన్లతో స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా ప్రొటోకాల్ ప్రకారం వీవీఐపీ ల దర్శనం కోసం ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు.
హైదరాబాద్ లోని ఏ ప్రాంతం నుంచైనా ఈసీఐల్ కు చేరుకుని అక్కడినుంచి కీసరగుట్టకు వెళ్లొచ్చు. ఈసీఐల్ చౌరస్తా నుంచి కీసరగుట్ట 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తార్నాక నుంచి 25 కిలోమీటర్ల దూరం వస్తుంది. తార్నాక చౌరస్తా నుంచి మౌలాలి మీదుగా ఈసీఐల్ చేరుకోవాలి. అక్కడినుంచి కుషాయిగూడ మీదుగా కీసరగుట్టకు ఆర్టీసీ పెద్దసంఖ్యలో సిటీ బస్సులు నడుపుతోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి కూడా కీసరగుట్టకు బస్సు సౌకర్యముంది. వాహనాల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కీసరగుట్టకు వెళ్లొచ్చు.