ఎట్టకేలకు... వరవరరావును కలిసేందుకు కుటుంబ సభ్యులకు అనుమతి...
కవి,విప్లవ రచయిత వరవరరావు(81)ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర హైకోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం వరవరరావు నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నందునా... అక్కడి ప్రోటోకాల్ను పాటిస్తూ ఆయన్ను కలవవచ్చునని స్పష్టం చేసింది. అలాగే వీవీ ఆరోగ్యంపై మూడు రోజుల్లోగా నివేదిక అందజేయాలని న్యాయస్థానం నానావతి ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించింది. జస్టిస్ ఆర్డీ ధనుకా,వీజీ బిష్ట్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది.
మహారాష్ట్రలో చెలరేగిన భీమా కోరేగావ్ అల్లర్లలో ప్రధాని మోదీ హత్యకు కుట్ర పన్నారన్న అభియోగాలపై వరవరరావును ఎన్ఐఏ అగస్టు,2019లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రెండేళ్లుగా ముంబైలోని తలోజా జైల్లో ఆయన విచారణ ఖైదీగా ఉంటూ వస్తున్నారు. వృద్దాప్యం,జైలు జీవితం కారణంగా ఇటీవల వరవరరావు ఆరోగ్యం క్షీణించింది. దీంతో ముంబైలోని నానవతి ఆస్పత్రికి తరలించి పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది.
వరవరరావు ఆరోగ్యం బాగా లేదని తెలిసినప్పటి నుంచి ఆయన్ను కలిసేందుకు కుటుంబ సభ్యులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర,కేంద్ర స్థాయిలో పలువురితో సంప్రదింపులు జరుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు ఎట్టకేలకు వరవరరావును కలిసేందుకు అనుమతినివ్వడం వారికి ఊరట కలిగించే అంశం. రెండేళ్లుగా కేసులో ఎలాంటి కదలిక లేదని,బెయిల్ పిటిషన్లను తిరస్కరిస్తున్నారని చాలాసార్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. బెయిల్ వస్తుందన్న ఆశ ఇక తమకు లేదని,కనీసం ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని ఒక దశలో వారు పేర్కొన్నారు.
ఇదే భీమా కోరేగావ్ అల్లర్లకు సంబంధించి ఎన్ఐఏ మరొకరిని అరెస్టు చేయడం గమనార్హం.ఢిల్లీ యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ హనీబాబు (54)ను ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. మావోయిస్టు అగ్రనేతలతో ఆయనకు సంబంధాలున్నాయన్న అభియోగాలు మోపారు. నాలుగు రోజుల క్రితమే ఎన్ఐఏ ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.