మహారాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ను కోరిన మహారాష్ట్ర రైతులు..?
మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ పోటి చేయనుందా...? ఎన్నికల చర్చల్లో భాగంగానే మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటూ ఆందోళన చేస్తున్న మహారాష్ట్ర ప్రజలు తెలంగాణ సీఎం కేసిఆర్తో భేటి అయ్యారా..? భేటిపై సీఎం కేసీఆర్ ఏమన్నారు..? తెలంగాణకు సరిహద్దుగా ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలోని మొత్తం అయిదు నియోజకవర్గాలకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు,రైతులు మంగళవారం హైదరాబాద్లో సీఏం కేసీఆర్ తో భేటి అయ్యారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తో పాటు రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత నేపథ్యంలోనే రాష్ట్రానికి సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర,నాందేడ్ జిల్లా గ్రామాల ప్రజలు తాము కూడ తెలంగాణలో కలుస్తామని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే గ్రామాల ప్రజలు మరో అడుగు ముందుకు వేశారు. మహారాష్ట్రా అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో పోరాటాన్ని ఉదృతం చేశారు. తెలంగాణలో తమని కలపాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇందు కోసం రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకువచ్చారు. తమ పోటీకి మద్దతు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్లో సీఎం కేసీఆర్ని కలిశారు.
సీఎంని కలిసిన వారిలో నాందేడ్ జిల్లాలోని నయ్ గావ్, బోకర్, డెగ్లూర్, కిన్వట్, హథ్గావ్ని నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలు ఉన్నారు. కాగా ఇదే అంశంపై మరోసారి సీఎం కేసీఆర్తో భేటి కానున్నట్టు తెలిపారు.నాందేడ్ జిల్లాలోని బీజేపీ,కాంగ్రెస్ ,శివసేనతోపాటు ఎన్సీపీ పార్టీలకు చెందిన నేతలందరు కలిసి వస్తామని చెప్పారు. ఇక మహా రైతులు,నాయకులు చేసిన విన్నపంపై సీఎం కేసిఆర్ సానూకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.