మహాశివరాత్రి సందడి.. శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. అర్ధరాత్రి లింగోద్భవ పూజలు
Recommended Video
హైదరాబాద్ : కోరిన కోర్కెలు తీర్చే భోళాశంకరుడు. భక్తుల పూజలతో ఇట్టే కరిగిపోతాడు. అందుకే ఆయన భక్త వశంకరుడు. విశ్వంలోని అణువణువునా నిండిన పరమాత్ముడు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. అందుకే సర్వంతర్యామి ఆ శివుడు. మహా రుద్రుణ్ని మహాద్భుతంగా స్మరించుకుంటూ కొలిచి మొక్కే పండుగే మహా శివరాత్రి. పండుగ పర్వదినాన రాష్ట్రమంతటా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి.
కరీంనగర్ జిల్లాలో...
రాష్ట్రమంతటా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజామునుంచే శివాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ రాజరాజేశ్వర స్వామి దివ్యక్షేత్రం శివరాత్రి శోభతో అలరారుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. కోడె మొక్కులు, ఇతరత్రా మొక్కులు తీర్చుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. శివనామ స్మరణతో రాజన్న సన్నిధి మార్మోగిపోతోంది.
ఆనవాయితీగా అందించే తిరుమల తిరుపతి దేవస్థానం పట్టువస్త్రాలను స్వామివారికి అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిషా నుంచి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. కల్యాణ మండపంలో సాయంత్రం 6 గంటల సమయంలో మహాలింగార్చన కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో లింగోద్భవ కాలమందు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.
హైదరాబాద్కు అతిదగ్గర్లో..! శివరాత్రి వేడుకలకు కీసరగుట్ట ముస్తాబు
వరంగల్ జిల్లాలో...
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు జరగనున్న కార్యక్రమాలతో ఆలయం కొత్తశోభ సంతరించుకుంది. శివరాత్రి వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ఈ పర్వదినం సందర్భంగా ఆర్టీసీ 50 ప్రత్యేక బస్సులు నడుపుతోంది.
వరంగల్ లోని వేయిస్తంభాల గుడిలో జరుగుతున్న శివరాత్రి వేడుకలకు భక్తులు తెల్లవారుజామునుంచే క్యూ కట్టారు. స్వామివారికి సుప్రభాత సేవ, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం 7 గంటలకు రుద్రేశ్వరస్వామి, రుద్రేశ్వరీ దేవి కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో లింగోద్భవ సమయంలో మహాన్యాసపూర్వక మహా రుద్రాభిషేకం జరపనున్నారు.
శివరాత్రి పర్వదినాన ములుగు జిల్లాలోని రామప్ప ఆలయం ఆధ్యాత్మిక శోభతో అలరారుతోంది. స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. రామలింగేశ్వర స్వామిగా కొలువుదీరిన పరమశివుడికి సుప్రభాత సేవ, గణపతి పూజ నిర్వహించారు. అనంతరం అఖండ దీపారాధన, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించారు. రాత్రి 10 గంటల సమయంలో కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.
నిజామాబాద్ జిల్లాలో
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని శివాలయాలకు భక్తులు క్యూ కట్టారు. శివనామస్మరణ జపిస్తూ స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. మహారుద్రుణ్ని కొలుస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు. నిజామాబాద్ లోని కంఠేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అటు ఆర్మూర్ లోని సిద్దుల గుట్టకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు.
రాజన్న సన్నిధికి పోటెత్తిన భక్తులు.. వేములవాడలో సైకత శివలింగం
ఆదిలాబాద్ జిల్లాలో
ఆదిలాబాద్ జిల్లాలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాన శివాలయాలకు భక్తులు క్యూ కడుతున్నారు. గోదావరి నదీ తీరంలోని బాసరకు కూడా పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. సోమ, మంగళ, బుధవారాలు.. మూడు రోజుల పాటు వేడుకలు జరగనున్న నేపథ్యంలో అధికారులు అన్నీ ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఇబ్బందలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. గోదావరి తీరంలోని సూర్యేశ్వర ఆలయం శివరాత్రి పర్వదినాన సరికొత్త శోభ సంతరించుకుంది. ఉదయం నుంచే బిల్వార్చన, అభిషేకం లాంటి తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. సాయంత్రం 6 గంటల సమయంలో మహాలింగార్చనతో పాటు లక్ష దీపాలు వెలిగించే కార్యక్రమం చేపట్టనున్నారు. వ్యాసేశ్వర ఆలయంలోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు ఆలయాల్లోనూ అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజలతో పాటు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం పూజలు జరపనున్నారు.