జంక్షన్లు జామ్... హైదరాబాద్ అష్టదిగ్బంధనం.. ఐనా రోడ్ల మీదకు వస్తున్న జనం..
హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు ఆయా రాష్ట్రాల పోలీసులు. ప్రధానంగా కీలక కూడళ్ల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి 24గంటలు ప్రజల రాకపోకలను అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపైనే కాకుండా ప్రధాన రహదారుల మీద దృష్టి సారించారు. నగరం నుండి సబ్ అర్బన్ ప్రాంతాలకు వెళ్లే ప్రధాన దారులను మూసివేసి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే సిటీలోకి స్వాగతం పలికే కూకట్ పల్లి వై జంక్షన్ వద్ద పోలీసులు పెద్ద ఎత్తున గస్తీ నిర్వహిస్తున్నారు.
కరోన వైరస్ విశ్వరూపం.. ఎదుర్కొనేందుకు సిద్దం అంటున్న యంత్రాంగం..
కరోనా మహమ్మారి ప్రభావంతో నగరం బోసి పోయింది. ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని, కనీసం మూడు వారాల పాటు ప్రజలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు పాటిస్తే ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరోధించగలమని తెలుస్తోంది. కరోనా వ్యాధి వ్యక్తి నుండి వ్యక్తికి చాలా సులువుగా, వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు జనజీవన స్రవంతి లోకి రాకూడదనే ఆంక్షలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ప్రజలను నియంత్రించేందుకు స్థానిక పోలీసు బలగాలను రంగంలోకి దించింది ప్రభుత్వం.
నగరంలో ఆంక్షలు.. జనాన్ని కట్టడి చేస్తున్న పోలీసులు..
నగరంలోని పోలీసు స్టేషన్లు తమ పరిధిలోని రహదార్లను కట్టడి చేస్తూ ప్రజలను అనవసరంగా రోడ్ల మీదకు రాకుండా నిలువరిస్తున్నారు. కూకట్ పల్లి సమీపంలోని వై జంక్షన్ లో కూడా రాకపోకలను పూర్తిగా నియంత్రిస్తున్నారు. ఇదే వై జంక్షన్ ను గతంలో గోద్రేజ్ చౌరస్తాగా పిలిచే వారు. బాలానగర్, కూకట్ పల్లి, జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతాలకు ఈ వౌ జంక్షన్ ప్రధాన కూడలిగా ఉంటుంది. ఇక్కడ నుండి సిటీకి రావాలన్నా, సిటీ నుండి బయటకు వెళ్లాలన్నా ఈ వై జంక్షన్ చేరుకోవాల్సిందే. నిత్యం లక్షల సంఖ్యలో వాహనాలు, లారీలు, ట్రక్కులు, బస్సులు, ద్విచక్ర వాహనాలు ఈ వై జంక్షన్ నుండి రాకపోకలు సాగించాల్సిందే.
ఎక్కడికక్కడ చెక్ పోస్టులు.. అకారణంగా బయటికి వస్తే అంతే సంగతులు..
ఐతే కరోనా ఆంక్షల నేపథ్యంలో ఈ చౌరస్తా చిన్నబోయినట్టు తెలుస్తోంది. పఠాన్ చెరు, మియాపూర్ నుండి అటు సికిందరాబాద్ వెళ్లాలన్నా, ఇటు పంజాగుట్ట, ఖైరతాబాద్, నాంపల్లి వెళ్లాలన్నా ఈ వై జంక్షన్ మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ప్రముఖ హాస్పటల్స్, థియేటర్స్, మల్టీ ప్లెక్స్ లు కూడా సిటిలోనే ఉండంతో ఈ వై జంక్షన్ కు జనాల తాకిడి ఎక్కువగా మారింది. అంతే కాకుండా ఇటీవల వెలిసిన డి మార్ట్, చెన్నై సిల్క్, మ్యాక్స్ వంటి మాల్స్ తో చౌరస్తా మరింత రద్దీగా మారింది. అకస్మాత్తుగా కరోనా ఆంక్షలతో వెలవెలబోతోంది. పోలీసులు చెక్ పోస్టులు ఏర్పాటు చేసి అకారణంగా సిటీలోకి వస్తున్న వారితో పాటు, సిటీ నుండి వెళ్తున్న వారిని జల్లెడ పడుతున్నారు పోలీసులు.
Recommended Video
స్వీయ నియంత్రనే బెటర్ అంటున్న పోలీసులు.. బయటికి రాకుండా కట్టడి..
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి భారత దేశంలో విళయ తాండవం చేయకముందే దాని నుండి విముక్తి పొందాలని ప్రభుత్వాలు పిలుపునిస్తున్నాయి. అందులో భాగంగా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ ఇళ్లకే పరిమితం కావాలని భావించాయి ప్రభుత్వాలు. అత్యుత్సాహంగా వ్యవహరిస్తున్న కొంత మందిపై పోలీసులు లాఠీ ఝుళిపించిన సందర్బాలు కూడా లేకపోలేదు. మొత్తానికి కరోనా ప్రభావంతో లక్షల వాహనాలతో రద్దీ గా ఉండే ప్రాంతాలు నర్మానుష్యంగా మారిపోయాయి. మరో 16రోజులు ప్రజలు ఇలాగే ఇళ్లకే పరిమితమైతే కరోనా అనే మహమ్మారిని జయించినట్టే ననే చర్చ కూడా జరుగుతోంది.