అధికారులకు మలక్ పేట్ గంజ్ టెన్షన్ ... 11మంది కూలీలకు కరోనా రావటంతో అలెర్ట్
హైదరాబాద్లోని మలక్పేట్ గంజ్ ... హోల్ సేల్ వ్యాపారానికి పెట్టింది పేరు. నిత్యం రద్దీగా ఉండే ఈ గంజ్ లో కరోనా కరాళ నృత్యం చేస్తుంది . ఇప్పటికే 11 మంది ఈ గంజ్ లో పని చేసే హమాలీలు కరోనా బారిన పడ్డారు . దీంతో రెడ్ జోన్ గా మారిన మలక్ పేట్ గంజ్ లో కరోనా కట్టడికి అధికారులు చర్యలు చేపట్టారు. మలక్ పేట్ గంజ్ లో వ్యాపార కార్యాకలాపాలు ఆపేసి గంజ్లోని కూలీలకు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. గంజ్లో నివాసం ఉంటున్న కూలీలకు అక్కడికక్కడే పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులకు ఇప్పుడు ఇక్కడ పరిస్థితి కొంత టెన్షన్ కలిగిస్తుంది.
వ్యాపారి నుండి 11 మంది కూలీలకు కరోనా పాజిటివ్
ఇప్పటి వరకు మలక్ పేట్ గంజ్ లో ఒక వ్యాపారికి మొదలైన కరోనా అక్కడ పని చేసే కూలీలకు అంటుకుంది. గంజ్లో నివాసంలో ఉంటున్న 11 మంది కూలీలకు కరోనా రావడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది . నిత్యం వ్యాపారాలతో బిజీగా ఉండే ఈ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కాంటాక్ట్ ద్వారా ఒకే కుటుంబంలోకి ఇద్దరు మృతిచెందారు. గంజ్లో ఉన్న ఓ షాపు యజమాని నుంచి కరోనా సోకటంతో హమాలీ కూలీలకు ఇంటి దగ్గరే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇక వారం రోజుల పాటు మలక్పేట్ గంజ్ను మూసివేయటంతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా, అధికారులు సరుకును ఇతర మార్కెట్లకు పంపించనున్నారు.
మలక్ పేట్ గంజ్ వారం పాటు మూసివేత .. పరీక్షలు చేస్తూ జల్లెడ
ఓవైపు తెలంగాణా రాష్ట్ర యంత్రాంగం కరోనా నుండి ప్రజలను కాపాడటానికి నానా తిప్పలు పడుతుంది . ఇక తాజాగా పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు అవుతోన్న సమయంలో.. మలక్పేట్ గంజ్ ఇప్పుడు ఒక ఉత్పాతం సృష్టించింది . దీంతో, రెండు రోజులుగా గంజ్పైనే దృష్టి పెట్టిన అధికారులు అక్కడ కూలీలకు పరీక్షలు నిర్వహిస్తూ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. మలక్పేట్ గంజ్లో ఉన్న ఓ వ్యాపారికి కరోనా వైరస్ సోకటంతో మొదలైన వ్యాప్తి తో ఇప్పుడు సదరు వ్యాపారి కుటుంబం కూడా ఇబ్బందిపడుతుంది. ఆయన అనారోగ్యం అని ప్రభుత్వాసుపత్రికి వెళ్లకుండా వనస్థలిపురంలోని తమ్ముడి దగ్గరకు వెళ్లి అక్కడే ఉండి ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
ఓ ప్రైవేట్ వైద్యుడి నిర్వాకంతో వ్యాపారి కుటుంబంలో ఇద్దరు మృతి.. కూలీలకు అంటుకున్న కరోనా
ఆస్పత్రి సిబ్బంది అతనికి కరోనా పాజిటివ్ అని గుర్తించటానికి చాలా సమయం పట్టింది. ప్రైవేటు ఆసపత్రి వైద్యుడు కరోనా పాజిటివ్ అని గుర్తించకపోవటంతో వ్యాపారి తమ్ముడి కుటుంబంలోని అందరికీ వైరస్ సోకింది. చివరికి వ్యాపారి తండ్రి, తమ్ముడిని బలి తీసుకుంది. ఇద్దరు చనిపోవడంతో సదరు ప్రైవేటు ఆసుపత్రిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఆ ఆసుపత్రి లో కరోనా పేషంట్కు ట్రీట్మెంట్ ఇచ్చిన వారందరినీ ఐసోలేషన్ కు తరలించారు . ఇక ఆ వ్యాపారి వల్లే గంజ్ లో చాలా మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందుకే ప్రస్తుతం మలక్ పేట్ గంజ్ వారం పాటు మూసేసి పరీక్షలు , శుభ్రతా చర్యలు నిర్వహిస్తున్నారు .