మహిళా ఎమ్మార్వో ఘటన మరువకముందే.. ఏసీబీ వలలో మరో అవినీతి చేప..!
హైదరాబాద్ : తెలంగాణలో అవినీతి చేపలు, తిమింగలాలు వరుసగా పట్టుబడుతున్నాయి. మహిళా ఎమ్మార్వో అవినీతి పర్వం నోట్ల కట్టలను బయటపెట్టింది. ఆమె నివాసంలో లక్షలకొద్దీ కరెన్సీ కట్టలు వెలుగుచూడటం రాష్ట్రవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. తాజాగా మరో అవినీతి చేప ఏసీబీకి పట్టుబడటం హాట్ టాపిక్ అయింది.
ఏసీబీ అధికారుల వలకు మరో అవినీతి చేప చిక్కింది. మల్కాజ్గిరి పెన్షన్ ఆఫీస్లో గుట్టురట్టైంది. అసిస్టెంట్ పెన్షన్ పేమెంట్ అధికారిగా పనిచేస్తున్న పూల్ నాయక్ బండారం బయటపడింది. పెన్షన్ ఇచ్చేందుకు ఓ మహిళ నుంచి 7 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు.
టిక్ టాక్ సరదా మరో ప్రాణం తీసిందిగా.. మేడ్చల్ జిల్లాలో విషాదం
పెన్షన్ డబ్బులు ఇవ్వడానికి సదరు మహిళను సతాయించాడు పూల్ నాయక్. ఆమెకు పెన్షన్ ఇవ్వడానికి లంచం డిమాండ్ చేశాడు. తనకు కొంత మొత్తం ఇస్తే గానీ పెన్షన్ ఇవ్వబోనంటూ ఇబ్బంది పెట్టాడు. దాంతో బాధితురాలు చేసేదేమీ లేక ఏసీబీని ఆశ్రయించారు. ఏడు వేల రూపాయలు ఆమె నుంచి స్వీకరిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.