కరెంట్ అక్రమాల్లో ఆధారాలున్నాయి.. సీఎం కేసీఆర్కు రేవంత్ రెడ్డి లేఖ..!
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. విద్యుత్ కొనుగోళ్లు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటులో అవినీతి జరిగిందని ఫైరయ్యారు. ఆ మేరకు కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు రేవంత్ రెడ్డి. అయిదున్నరేళ్ల టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని.. స్వతంత్ర సంస్థలన్నీ ఇండిపెండెన్స్ కోల్పోయాయని ఆరోపించారు.
తెలంగాణలో విద్యుత్ సంస్థల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయినట్లు లేఖలో రాశారు. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్రొడక్షన్ సెంటర్ల ఏర్పాటులో అవినీతికి సంబంధించి అన్నీ ఆధారాలు తన దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. విద్యుత్ సంస్థల్లో ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. దాంతో ఎప్పుడైనా అవి నిర్వీర్యం అయ్యే ఛాన్సుందని హెచ్చరించారు.
15 రోజుల్లో పెళ్లి పెట్టుకుని.. శంషాబాద్ ఎయిర్పోర్టు మిస్సింగ్ కేసులో యువకుడి డ్రామా..!
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు ఎందుకు లెక్కిస్తోందని ప్రశ్నించారు. ఆయా పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కేసీఆర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎనిమిది నెలలుగా ఆ పోస్టులు ఖాళీగా ఉంటే ఇప్పటివరకు ఎందుకు భర్తీ చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే ఛైర్మన్తో పాటు సభ్యులను నియమించే ఆలోచన లేనట్లుగా కనిపిస్తోందని ధ్వజమెత్తారు.
ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్ తీసుకోకుండా.. విద్యుత్ రంగంలో తీసుకునే ఏ డెసిషనైనా చట్ట విరుద్దమన్నారు రేవంత్ రెడ్డి. 2020-2021 ఫైనాన్షియల్ ఇయర్కు సంబంధించి విద్యుత్ సంస్థల ఛార్జీల ప్రతిపాదనలు నవంబర్ 2 లోపు పంపించాల్సి ఉందనే విషయం ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. ఆలోగా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఛైర్మన్, సభ్యులను నియమించాలని కోరారు. 2014 - 2015 నుంచి ఇప్పటి వరకు ఈఆర్సీకి నివేదికలు సక్రమంగా అందించిన దాఖలాలు లేవని లేఖలో పేర్కొన్నారు.