కాంగ్రెస్ కు పెద్ద దిక్కు ఆ ఒక్కడేనా..! ప్రమోషన్ ఉంటుందా? సీఎల్పీ లీడరా.. పీసీసీ చీఫా?
హైదరాబాద్ : మహాకూటమి బోల్తా కొట్టింది. అనుకున్నదంతా రివర్స్ అయింది. కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలందరికీ అపజయమే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీకి అంతో ఇంతో కలిసివచ్చిన వ్యక్తిగా మల్లు భట్టివిక్రమార్క మార్కులు కొట్టేశారు. ఆయన ఖమ్మం జిల్లా మధిర సెగ్మెంట్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతేకాదు ఆ జిల్లా నుంచి మరో 7 స్థానాలు పార్టీ ఖాతాలో జమచేశారు. దీంతో ఆ పార్టీలో నెంబర్ వన్ లీడర్ గా మారిపోయారు.
అధికారం మాదే అంటూ హడావిడి చేసిన కాంగ్రెస్ దిగ్గజాలు చివరకు కారు జోరుతో ఢీలా పడ్డారు. జానారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి అగ్రనేతలకు ఓటమి తప్పలేదు. అంతేకాదు వారి జిల్లాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైంది.
ఉత్తమ్ వట్టిదేనా?.. నెంబర్ వన్ భట్టియేనా..!
నల్గొండ జిల్లాకు చెందిన పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొద్దిలో బయటపడ్డారు. ఆయన సతీమణి మాత్రం ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో పార్టీ వెనుకబడింది. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సెగ్మెంట్ లో గెలిచినా.. పీసీసీ అధ్యక్షుడిగా ఓడిపోయారనే భావన కనిపిస్తోంది. అటు ఖమ్మం జిల్లాలో 9 స్థానాలకు గాను 8 స్థానాల్లో పట్టు నిలుపుకొంది కాంగ్రెస్ పార్టీ. దీంతో రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ గా ఉన్న భట్టి విక్రమార్కకు ప్లస్ పాయింట్ గా మారనుంది.
బాబు-కేసీఆర్లే సీఎంలుగా ఉండాలి: సుమన్, టీడీపీతో పొత్తుపై విజయశాంతి ఘాటు వ్యాఖ్యలు
పీసీసీ చీఫ్ లేదంటే సీఎల్పీ లీడర్..!
కారు హవాతో బోల్తా పడ్డ కాంగ్రెస్ పార్టీకి మల్లు భట్టి విక్రమార్క పెద్ద దిక్కుగా మారిపోయారు. మహామహులంతా అపజయం పాలవడంతో ఆ పార్టీకి చుక్కానిలా మారిపోయారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘోరంగా విఫలమయ్యారనే టాక్ నడుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పార్టీ గెలిచిన స్థానాల్లో అత్యధికంగా 8 స్థానాలు ఖమ్మం జిల్లా నుంచి ఉండటం విశేషం. అదే జిల్లాకు చెందిన భట్టికి ఇప్పుడు అది వరంలా మారనుంది. ఢిల్లీ పెద్దల దగ్గర కూడా మార్కులు కొట్టేసినట్లే.
రాష్ట్రమంతా గులాబీ ప్రభంజనముంటే.. ఖమ్మం జిల్లాలో కేసీఆర్, కేటీఆర్ ప్రచారం చేసినా వర్కవుట్ కాలేదు. అక్కడ మహాకూటమి జోరు కొనసాగింది. ఇదంతా భట్టి విక్రమార్కకు ప్లస్ గా మారింది. పీసీసీ చీఫ్ పదవినుంచి ఉత్తమ్ ను పక్కకునెట్టి ఆ స్థానంలో భట్టికి ఛాన్స్ రావొచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. లేదంటే సీఎల్పీ లీడర్ గా అవకాశం దక్కనుంది. అయితే భట్టి మాత్రం పీసీసీ చీఫ్ పదవిపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
దళితులకు పెద్దపీట.. కాంగ్రెస్ మాట
కాంగ్రెస్ పార్టీ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో తలపడ్డ దళిత అగ్రనేతలంతా ఓటమి పాలయ్యారు. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం లభించనుంది. అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిగా చేస్తామని ఢిల్లీ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్ లోని దళిత నేతలు చాలామంది ఆశలు పెట్టుకున్నారు. చివరకు ఎన్నికల్లో వారంతా ఓటమి పాలయ్యారు.
కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ గా తనవంతు పాత్ర పోషించిన భట్టి విక్రమార్క.. ఖమ్మం జిల్లాలో తన పట్టు కాపాడుకున్నారు. గతంలో ఆయనకు చీఫ్ విప్, డిప్యూటి స్పీకర్ పదవుల్లో పనిచేసిన అనుభవముంది. అంతేకాదు నాలుగేళ్ల నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ గా సమర్థవంతంగా పనిచేశారనే పేరుంది. దళిత నేత కావడం, పార్టీలో కీలకంగా మారడం ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే ఆయనకు పీసీసీ ప్రెసిడెంట్ లేదంటే సీఎల్పీ లీడర్ ఖాయమనే టాక్ బలంగా వినిపిస్తోంది.