ఎట్టకేలకు దళిత నేతను వరించిన సీఎల్పీ, భట్టికి జైకొట్టిన రాహుల్ గాంధీ
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణ సీఎల్పీ పదవిపై రెండు మూడు రోజులుగా జరుగుతున్న డ్రామాకు ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం తెరదించారు. ఎట్టకేలకు ఈ పదవికి దళిత నేత మల్లు భట్టి విక్రమార్కను అధిష్టానం ఎంపిక చేసింది. ఎన్నో ఈక్వేషన్స్ క్యాస్ట్ ఈక్వేషన్స్ తర్వాత ఈయనకు పదవి కట్టబెట్టారు.
భట్టి విక్రమార్కకు గతంలో డిప్యూటీ స్పీకర్గా పని చేసిన అనుభవం ఉంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లేదా మహాకూటమి గెలిస్తే ఈయన ముఖ్యమంత్రి రేసులో ఉన్నారని ప్రచారం సాగింది. అలాగే, విభజనకు ముందు తెలంగాణ బిల్లు ఆంధ్రప్రదేశ్ శాసన సభకు వచ్చిన సమయంలో ఈయన కీలక పాత్ర పోషించారు. విభజన బిల్లుపై అసెంబ్లీలో చర్చ, దానికి ఆమోదంలో ఈయన పాత్ర ఉంది.
అదే సమయంలో తాజాగా, సీఎల్పీ రేసులో సబితా ఇంద్రా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం కోసం ప్రయత్నాలు చేశారని అంటున్నారు. ఆ తర్వాత శ్రీధర్ బాబు పేరు కూడా వినిపించింది. అయితే అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి భట్టి వైపు మొగ్గు చూపింది. మరో విషయం ఏమంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమికి ఎక్కువ స్థానాలు ఖమ్మం నుంచి వచ్చాయి. భట్టికి సీఎల్పీ కట్టబెట్టడంతో అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
మల్లు భట్టి విక్రమార్క 2009లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో చీఫ్ విప్ అయ్యారు. అనంతరం సమైక్య ఏపీలో డిప్యూటీ స్పీకర్గా పని చేశారు. 2014లోను మధిర నుంచి గెలిచారు. 2018లోను మరోసారి విజయం సాధించారు.