బెట్టింగ్ రాజా.. భార్యను బురిడీ కొట్టించి సొంతింట్లో చోరీ.. దసరా సెలవుల్లో పక్కా ప్లాన్
హైదరాబాద్ : భార్యను బురిడీ కొట్టించాడు. దర్జాగా 7 లక్షల రూపాయలు దోచాడు. ఆమె పుట్టింటి నుంచి తిరిగి వచ్చేసరికి కట్టుకథ అల్లాడు. దొంగలు పడ్డాడని నమ్మించాడు. అతడు చెప్పిందేదో తిరకాసుగా అనుమానించిన ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించడంతో ఇంటి దొంగ గుట్టు రట్టైంది. కష్టపడి డబ్బులు సంపాదించే తత్వం లేని ఆ భర్త.. బెట్టింగులకు అలవాటు పడి సొంతింట్లో చోరీకి పాల్పడ్డాడు. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం వెలుగు చూడటంతో భర్త గారి బాగోతం బయటపడింది.
బెట్టింగులకు బానిస.. భార్యను బురిడీ కొట్టించి
రంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసిన ఘటన స్థానికంగా చర్చానీయాంశమైంది. కొందుర్గు మండల కేంద్రానికి చెందిన కావలి ఆంజనేయులు కష్టపడి సంపాదించడానికి ఇష్టపడేవాడు కాదు. దాంతో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బులు సంపాదించొచ్చని భావించి ఉన్నదంతా పొగొట్టుకుంటున్నాడు. ఆ క్రమంలో భార్యకు తెలియకుండా 7 లక్షల రూపాయలు కాజేసి దొంగతనం జరిగినట్లుగా చిత్రీకరించాడు. ఆ డబ్బులతో 2 లక్షల రూపాయల వరకు అప్పులు తీర్చుకుని మిగతా మొత్తం మళ్లీ బెట్టింగుల్లోనే పెట్టడం గమనార్హం.
సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కానిస్టేబుల్ ఆత్మహత్య
సొంతింట్లో చోరీ.. భార్యను దసరా సెలవులకు పంపి
ఆంజనేయులుకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కుటుంబ పోషణకు ఎలాంటి పని చేయకుండా కేవలం బెట్టింగులు కాస్తూ కాలాయాపన చేసేవాడు. ఆ క్రమంలో సంపాదించింది ఏమీ లేకపోగా అప్పులు అయ్యాయి. భూములు అమ్ముకుంటూ, బెట్టింగులకు పాల్పడుతూ లక్షల రూపాయలు నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. అయితే ఇటీవల తమకున్న కొద్దిపాటి భూమి కూడా అమ్మడంతో 7 లక్షల రూపాయలు వచ్చాయి. అంతలోనే పిల్లలకు దసరా సెలవులు రావడంతో భార్యను పుట్టింటికి వెళ్లాలని సూచించాడు. సరదాగా గడిపి రావాలని కోరాడు. దాంతో ఆ 7 లక్షలను భర్తకు తెలియకుండా ఓ బాక్స్లో దాచి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.
ఇంటి దొంగ దొరికాడు ఇలా..!
భార్య అలా పుట్టింటికి వెళ్లిందో లేదో తన ప్లాన్ పక్కాగా అమలు చేశాడు ఆంజనేయులు. ఆమె బాక్సులో దాచిన డబ్బులను తీసుకుని 2 లక్షల రూపాయల మేర అప్పులు తీర్చుకున్నాడు. మిగతా ఐదు లక్షల రూపాయలను తన స్నేహితులైన సంజీవ్, సతీష్, సలామ్తో కలిసి కబడ్డీలో బెట్టింగ్ కాశాడు. ఈసారి కూడా బెట్టింగులో డబ్బులు పొగొట్టుకుని భార్యకు ఏం చెప్పాలో తెలియక కట్టుకథ అల్లాడు. పండుగ తర్వాత ఆమె పుట్టింటి నుంచి తిరిగి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారని నమ్మించాడు.
భార్య ఫిర్యాదుతో కదిలిన డొంక
ఇంట్లో దొంగలు పడ్డారని భర్త చెప్పడంతో ఈ నెల 11వ తేదీన ఆమె కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయడంతో అసలు విషయం బయటపడింది. ఇంటికి వేసిన తాళం విరిగిపోక పోవడం.. ఎక్కడా కూడా ధ్వంసం జరిగినట్లు ఆనవాళ్లు లేకపోవడం పోలీసులకు అనుమానాలు కలిగించాయి. ఆ మేరకు ఆంజనేయులు ఫోన్ కాలే డేటాను పరిశీలించడంతో గుట్టు రట్టైంది.
ఆర్టీసీ కార్మికులకు హైకోర్టులో ఊరట.. సెప్టెంబర్ జీతాలు చెల్లించాలంటూ..!
బెట్టింగ్ ముఠా అరెస్ట్
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశ ఆంజనేయులును కుదురుగా ఉండనివ్వలేదు. క్రికెట్, కబడ్డీల పోటీలు జరిగే క్రమంలో తోటి మిత్రులతో కలిసి బెట్టింగులకు పాల్పడేవాడు. ఇందులో సంజీవ్ అనే వ్యక్తి మీడియేటర్గా వ్యవహరిస్తున్నాడు. సొంతింట్లో డబ్బులు కాజేసిన ఆంజనేయులు మీద కన్నేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆ క్రమంలో అతడి స్నేహితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. ఈ నేపథ్యంలో సలామ్, సతీష్, సంజీవ్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 4 లక్షల 70 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి 8 మంది వ్యక్తులపై 2 లక్షల రూపాయల ధరావత్తుతో బైండోవర్ కేసు నమోదు చేశారు.