బంగారం పేస్ట్ లా మార్చి జీన్స్ లో దాచి: స్మగ్లింగ్ లో కొత్త పుంతలు
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా ప్రమాణాలు ఎంతగా తీసుకున్నా , అనునిత్యం తనిఖీలు జరుగుతున్నా ఎయిర్ వేస్ మార్గంగా బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నం చేస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం పట్టుకోవటం నిత్య కృత్యమైపోయింది. కిలోల కొద్దీ బంగారం పట్టుబడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ పోర్ట్ పోలీసులు ప్రతి నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నా స్మగ్లర్లు మరింత తెలివి ఉపయోగిస్తున్నారు.
తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారాన్ని పేస్ట్ గా మార్చి జీన్స్ లో దాచి తీసుకు వచ్చిన వ్యక్తిని డి ఆర్ ఐ అధికారులు పట్టుకున్నారు. షార్జా నుండి హైదరాబాదుకు వచ్చిన విమానంలో ఓ ప్రయాణికుడు బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి ప్రత్యేకంగా కుట్టించిన జీన్స్ పాయింట్ లో దాచి పట్టుకొచ్చాడు. అనుమానంతో తనిఖీ చేయగా అతని పాంట్ లోపల పేస్టు రూపంలో మార్చిన బంగారాన్ని ప్లాస్టిక్ కవర్లో పెట్టి కుట్టినట్లుగా గుర్తించారు. ప్యాంట్ కట్ చేసి చూడగా అందులో అర కిలో కి పైగా ఖచ్చితంగా చెప్పాలంటే 653 గ్రాముల బంగారం ఉంది.
బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు బంగారం తీసుకువచ్చిన ప్రయాణికుడితో పాటు ఇక అతని వద్ద నుండి బంగారాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన మరో యువకుడిని అరెస్టు చేశారు. ఇక అక్రమ రవాణాలో తీసుకొచ్చిన ఈ బంగారం విలువ 24 లక్షల రూపాయలకు పైగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. రోజుకొక మార్గంలో ఎవరికి అనుమానం రాకుండా, స్మగ్లర్లు బంగారం అక్రమ రవాణాకు ప్రయత్నిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో అధికారులు ఇలా బంగారం అక్రమ రవాణా చేస్తున్న వారిని అరెస్ట్ చేయడం నిత్యకృత్యంగా మారింది.