హైదరాబాద్ పాతబస్తీలో దారుణం.. తల్లీకూతుళ్ల దారుణ హత్య.. చంపింది అతనే..
హైదరాబాద్లోని పాతబస్తీలో దారుణం జరిగింది. నల్లవాగుపాడులోని ఓ ఇంట్లో తల్లీకూతుళ్లు దారుణ హత్యకు గురయ్యారు. హత్య ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. కూతురి భర్తే హత్యకు పాల్పడ్డట్టు పోలీసులు గుర్తించారు. మృతులను సరీదా బేగం,ఫరీదా బేగంలుగా.. హంతకుడిని రెహమాన్గా గుర్తించారు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిస్తే.. నల్లవాగుపాడులోని ఓ ఇంట్లో ఫరీదా బేగం,రెహమాన్ దంపతులు నివసిస్తున్నారు. వీరితో పాటు ఫరీదా తల్లి సరీదా బేగం కూడా ఉంటోంది. కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయమై వీరి మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. గురువారం ఉదయం కూడా ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఎలాంటి అలికిడి వినిపించలేదు. శుక్రవారం ఉదయం కూడా ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని.. ఇంటి తలుపులు బద్దలు కొట్టారు.
లోపలికి వెళ్లి చూసేసరికి.. ఫరీదా బేగం,సరీదా బేగం హత్యకు గురై కనిపించారు. ఫరీదా భర్త రెహమానే వీరిని హత్య చేసినట్టు గుర్తించారు. క్లూస్ టీమ్ను,డాగ్ స్క్వాడ్ను రప్పించి ఆధారాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు హత్య గురించి తెలిసి అటు రెహమాన్ బంధువులు,ఇటు ఫరీదా బంధువులు ఆ ఇంటి వద్దకు చేరుకున్నారు. రెహమాన్ కొంతకాలంగా ఆర్థిక లావాదేవీల విషయంలో వారితో గొడవపడుతున్నాడని వారు చెబుతున్నారు. ప్రస్తుతం రెహమాన్ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వీలైనంత త్వరగా అతన్ని పట్టుకుంటామని చెబుతున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించినట్టు సమాచారం.