హైదరాబాద్లో నయా మోసం : కిడ్నీ కొంటామని రూ.21 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
హైదరాబాద్ : అమాయకుల జేబులు గుల్ల చేసేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త ప్లాన్లు వేస్తున్నారు. జనాల అవసరాలను ఆసరా చేసుకుని బురిడీ కొట్టిస్తున్నారు. లాటరీలు, గిఫ్ట్ కూపన్ల ఆశ చూపి ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు ఇప్పుడు కిడ్నీ కొంటామని ప్రకటనలిచ్చి నిలువునా ముంచుతున్నారు. ఇంటర్నెట్లో ఇలాంటి ఓ యాడ్ చూసి లక్షల రూపాయలు కోల్పోయిన ఘటన రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిథిలో జరిగింది.
Recommended Video
కిడ్నీకి రూ.1.6 కోట్లు
ఎల్బీ నగర్కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. ఆ సమస్యల నుంచి బయటపడేందుకు కిడ్నీ అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు. అయితే ఎవరిని ఎలా కాంటాక్ట్ కావాలో తెలియక ఇంటర్నెట్ను ఆశ్రయించాడు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్లో డా.వెస్లీ డేవిడ్ పేరుతో ఉన్న ఓ యాడ్ చూసి అందులో ఉన్న నెంబర్కు కాల్ చేశాడు. తమకు కిడ్నీ అత్యవసరంగా అవసరముందని చెప్పి అవతలి వ్యక్తి అందుకోసం రూ.1.6 కోట్లు చెల్లిస్తామని చెప్పాడు. బంపర్ ఆఫర్ ఇవ్వడంతో బాధితుడు ఓకే చెప్పాడు.
అప్పు చేసి రూ.21 లక్షలు సమర్పణ
బాధితుడు ట్రాప్లో పడ్డాడని నిర్థారించుకున్న ఆ కేటుగాళ్లు ఇక ఆట మొదలుపెట్టారు. ఆ ఖర్చు ఈ ఖర్చు, ఆ ఛార్జీలు ఈ ఛార్జీలు అంటూ డబ్బు గుంజడం మొదలుపెట్టారు. మొదట డా.కర్రీ, డా.రవిభన్సల్ పేరుతో మాట్లాడిన వ్యక్తులు ప్రాసెసింగ్ ఫీజు పేరుతో మొదలు పెట్టిన వసూళ్ల పర్వం దాదాపు 8 నెలల పాటు కొనసాగించారు. పలు దఫాలుగా 27 బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయించుకున్నారు. ఇదంతా సీక్రెట్ వ్యవహారం కావడంతో బాధితుడు ఎవరికీ చెప్పకుండా అప్పు చేసి మరీ అడిగినంత సొమ్ము ముట్టజెప్పాడు.
పోలీసుల్ని ఆశ్రయించిన బాధితుడు
బాధితుడి నుంచి దాదాపు రూ.21లక్షలు వసూలు చేసిన ఆ సైబర్ మోసగాళ్లు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆఫ్రికా దేశాలకు చెందిన నేరస్తులు ఈ ఉత్తరాది రాష్ట్రాలతో పాటు బెంగళూరుకు చెందిన బ్యాంకుల్లో సొమ్ము జమైనట్లు గుర్తించారు. నిందితుల కోసం ఆచూకీ కనుగొనే ప్రయత్నంలో పడ్డారు.