హైదరాబాద్ నడిరోడ్డుపై మరో దారుణం: స్నేహితుడిని అతి కిరాతకంగా నరికి చంపిన వ్యక్తి
నడిరోడ్డుపై అది కూడా అందరూ చూస్తుండగానే కిరాతకంగా హత్య చేయడం తెలంగాణలో కామన్ అయిపోయినట్లు కనిపిస్తోంది. కొన్ని నెలల క్రితం నల్గొండ జిల్లాలో పరువుహత్య సంచలనం సృష్టించగా అది జరిగిన కొద్ది రోజులకే హైదరాబాద్లోని ఎర్రగడ్డలో మరో హత్యాయత్నం చూశాం. అది మరువక ముందే అత్తాపూర్లో ఓ వ్యక్తి మరో వ్యక్తిని దారుణంగా నరికి చంపడం హైదరాబాద్ను వణికించింది. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. బాగా తెలిసిన వ్యక్తినే మరో వ్యక్తి బుధవారం సాయంత్రం అందరూ చూస్తుండగానే మచ్చుకత్తితో కసితీరా నరికి చంపాడు.
ఆటో రిక్షా విషయమై గొడవ పడ్డ ఇద్దరు వ్యక్తులు
హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయా అంటే ఔననే సమాధానం వినిపిస్తోంది. నడిరోడ్డపై హత్య చేయడం చాలా కామన్ అయిపోతోంది. బుధవారం సాయంత్రం అబ్దుల్ ఖాజా అనే వ్యక్తి షకీర్ ఖురేషీ అనే మరో వ్యక్తిని మాంసం కట్ చేసే మచ్చు కత్తితో కసితీరా నరికి చంపాడు . ఈ ఘటన నగరంలో కలకలం సృష్టించింది. మృతుడు షకీర్ ఖురేషీ, నిందితుడు ఖాజా ఇద్దరు చంచల్గూడా ప్రాంతానికి చెందిన వారు. ఖురేషీ ఆటోను ఖాజాకు అద్దెకు ఇచ్చాడు. ఖాజా దీన్ని మరో వ్యక్తికి కట్టబెట్టాడు. ఇది నచ్చని ఖురేషీ పలుమార్లు ఖాజాను హెచ్చరించాడు. అయినప్పటికీ ఖాజాలో మార్పు రాలేదు. దీనిపై పలుమార్లు ఇద్దరూ గొడవపడ్డారు కూడా.
నా కుటంబంపై అసభ్య పదజాలం వాడినందుకే చంపేశాను
విషయం సెటిల్ చేసుకుందామని ఇద్దరూ భావించి ఒకచోట కలిశారు. మాటా మాటా పెరిగింది. ఇద్దరూ మళ్లీ గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఖురేషీ ఖాజాను అతని కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలం వాడటంతో ఇది జీర్ణించుకోలేని ఖాజా కత్తితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు. అయితే ఈ కత్తిని ఖాజా తెచ్చుకోలేదని మృతుడు ఖురేషీ తెచ్చుకున్నట్లు తెలిపారు. అతని దగ్గర నుంచి కత్తిని లాక్కుని నరికి చంపినట్లు పోలీసులు చెప్పారు. చంపిన తర్వాత మళ్లీ కాసేపు విరామం ఇచ్చి తిరిగి కసితీరా కత్తితో పొడిచాడు ఖాజా. కత్తిపోట్లకు గురైన ఖురేషీ రక్తపు మడుగులో కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణాన్ని అక్కడే ఉన్న స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
నిస్సహాయ స్థితిలో నిలిచి ఉన్న ట్రాఫిక్ పోలీసు
హత్య జరిగిన 10 నిమిషాలకు పోలీసులకు అక్కడే ఉన్న మరో పోలీసు సమాచారం ఇచ్చాడు. ఖాజా మాత్రం తనను ఉరి తీసినా పర్వాలేదంటూ గట్టిగా అరిచాడు. తాను చనిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఖురేషీ మృతదేహం వద్దే కూర్చున్నాడు. మొత్తానికి ఈ దారుణం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నగర వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. అత్తాపూర్ ఘటనలానే హత్య జరుగుతున్న సమయంలో ట్రాఫిక్ పోలీసు అక్కడే ఎలాగైతే నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడో ఈ తాజా హత్యలో కూడా మరో ట్రాఫిక్ పోలీసు అదే నిస్సహాయ స్థితిలో ఏమి చేయలేని పరిస్థితుల్లో నిలిచి ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కపిపించింది.