కార్పొరేటర్ కాలర్ పట్టిన మహిళ - ఇళ్లు మునిగి ఇక్కట్లతో ఆగ్రహం - హైదరాబాద్కు భారీ వర్ష సూచన
హైదరాబాద్ లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం దాకా కురిసిన భారీ వర్షాల ధాటికి పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం నాటి వర్షాలకు వరదలో మునిగిపోయిన లోతట్టు ప్రాంతాలు.. తేరుకునే అవకాశం లేకుండా తాజా వర్షాలు జనం ఇబ్బందులను రెట్టింపు చేశాయి. హయత్నగర్ పరిధిలో రికార్డు స్థాయిలో వాన కురవగా, అక్కడి పలు కాలనీల్లో వరద బీభత్సం కొనసాగింది.
ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడం, ఇళ్లలోకి పెద్ద ఎత్తున వరద చేరుకోవడంతో స్థానికులు ఇబ్బందిపడ్డారు. వాళ్లను పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్ఎస్ కార్పొరేటర్ కు చేదు అనుభవం ఎదురైంది. మరోవైపు సిటీలో మరింత వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించింది..
హైదరాబాద్ మళ్లీ ఆగం: తాజా పరిస్థితి - జలదిగ్బంధం - ఇద్దరు మృతి - హైవేలు బంద్ - కూలిన గోల్కొండ గోడ
నిన్న ఎమ్మెల్యే.. నేడు కార్పొరేటర్..
మొన్న ఉప్పల్ ఎమ్మెల్యేను ఓ స్థానిక మమిళ నిలదీసిన వీడియో వైరల్ కావడం తెలిసిందే. తాజాగా హయత్నగర్ డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్టలో కార్పొరేటర్ తిరుమలరెడ్డిపై స్థానికులు దాడి చేశారు. నాలా భూముల కబ్జాపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చి సమీపంలోని నాలా కబ్జాకు గురవడంతో వరదనీరు ఎక్కడికక్కడ నిలిచిపోతోందని ఆగ్రహించారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాలాల కబ్జాలతో బంజారా కాలనీ, రంగనాయకుల గుట్ట పూర్తిగా మునిగిపోయింది.
గల్లా పట్టి లాగిన మహిళ..
ఆదివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లిన టీఆర్ఎస్ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డిపై బంజారా కాలనీకి చెందిన ఓ మహిళ దాడికి పాల్పడింది. తిరుమలరెడ్డిని తిట్టిపోస్తూ, అతని కాలర్ పట్టుకుని ఈడ్చేసే ప్రయత్నం చేసింది. చెరువులో కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా తిరుమలరెడ్డి పట్టించుకోవడం లేదంటూ స్థానికులు మండిపడ్డారు. కార్పొరేటర్ అనుచరులు ఆ మహిళలను దూరంగా లాక్కెళ్లడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
అరే తాహిర్.. కారుతోపాటు కొట్టుకుపోతావ్ - హైదరాబాద్ భయానక వీడియోలు - దేవుడా ఏంటీ శిక్ష?
Recommended Video
హైదరాబాద్ బీ అలర్ట్..
గురువారం చిన్నపాటి ప్రళయాన్ని చవిచూసిన హైదరాబాద్.. శనివారం రాత్రి కూడా దాదాపు అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. సిటీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురవడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో పిల్లాపాపలతో కలిసి ఇళ్లపైకి చేరిన జనం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. సిటీలో మరో మూడ్రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి జిల్లా పరిధిలో కురుస్తున్న వర్షాలు కురుస్తుండగా, రాగల 48 గంటల్లో దక్షిణ తెలంగాణ జిల్లాలకు కూడా వ్యాపిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణంలో విపరీత మార్పులే ఈ వర్షాలకు కారణమని, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కారణంగా ఎక్కడికక్కడ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు పడుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వివరించింది.