ఆర్టీసీ కార్మికుల వెనుక మావోల హస్తం .. సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీ
ఆర్టీసీ కార్మికుల వెనుక మావోలు ఉన్నారా? ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఆందోళనలో మావోలు పాత్ర తీసుకుంటున్నారా? హైదరాబాద్ సీపి ఏం చెబుతున్నారు? చలో ట్యాంక్ బండ్ వ్యవహారంలో పోలీసులు చేసిన లాఠీఛార్జి కి కారణం ఏంటి ?
ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమం ఉద్రిక్తం
ఆర్టీసీ కార్మికులు 36 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. రోజుకో రకమైన ఆందోళనతో తమ సమస్యలను పరిష్కరించాలని నిరసన తెలియజేస్తున్న ఆర్టీసీ కార్మికులు, వారికి మద్దతు పలికిన రాజకీయ పార్టీలు చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహించాలని భావించారు. ఎలాగైనా చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం నిర్వహించి తీరుతామని కార్మికులు ట్యాంక్ బండ్ వైపు దూసుకుపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
లాఠీలకు పని చెప్పిన పోలీసులు .. సీపీ సంచలన వ్యాఖ్యలు
పోలీసులు లాఠీలకు పని చెప్పారు. ఆడ, మగ తేడా లేకుండా విచక్షణారహితంగా కొట్టారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ట్యాంక్ బండ్ వైపు దూసుకు పోయిన ఆందోళనకారులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసులు అందుకు చెప్తున్న కారణాలు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఆర్టీసీ కార్మికుల వెనుక మావోలు ఉన్నారని హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
మావోలతో కలిసే చలో ట్యాంక్ బండ్ అని సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీ
గడిచిన 36 రోజులుగా తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యమం చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని సిపి అంజన్ కుమార్ ఆరోపించారు. ఇక అంతే కాదు ఆర్టీసీ కార్మికులకు చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వకపోవడానికి కారణం కూడా అదే నంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. మావో అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్న కారణంగానే ట్యాంక్ బండ్ మీద జరిగిన చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదన్న అంజన్ కుమార్ చలో ట్యాంక్ బండ్ హింసాత్మకంగా మారటం.. పోలీసుల తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వేళ ఈ వ్యాఖ్యలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
పోలీసుల నిషేధం ఉన్న మావో సంఘాలతో ఆర్టీసీ సంఘాలు కలిశాయన్న సీపీ
ఆర్టీసీ కార్మికుల నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్ మీదకు దూసుకొచ్చిన నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ క్రమంలో తీవ్రంగా గాయపడిన వారిని చూసిన కొందరు పోలీసుల మీద రాళ్ళు రువ్విన ట్లుగా ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతుంటే.. అందుకు భిన్నంగా హైదరాబాద్ సీపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. పోలీసుల నిషేధం ఉన్న మావో సంఘాలతో ఆర్టీసీ సంఘాలు కావాలనే పోలీసులపైకి రాళ్లు విసిరారంటూ ఆరోపణలు చేశారు.
రాళ్ళ దాడిలో ఏడుగురు పోలీసులకు గాయాలయ్యాయన్న అంజన్ కుమార్
ఆర్టీసీ కార్మికులు, వారితో పాటు కలిసి ఉన్న మావోల రాళ్లదాడిలో ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని చెప్పిన సీపీ అంజనీ కుమార్ అందుకు బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు పెడతామన్నారు. చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వకున్నా, తమ మాట వినకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు ట్యాంక్ బండ్ వైపు చొచ్చుకొచ్చారని ఆయన పేర్కొన్నారు.ఆందోళకారులు విసిరిన రాళ్ల కారణంగా అడిషనల్ డీసీపీ రామచంద్రరావ్, ఏసీపీ రత్నం, సీఐ సైదిరెడ్డి, ఎస్ ఐ శేఖర్, కానిస్టేబుల్ రాజులు గాయపడ్డారని తెలిపారు.
సీపీ వ్యాఖ్యలపై ఆర్టీసీ కార్మికుల ఆగ్రహం
ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకే పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారన్నారు. ఇప్పటివరకూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది. ఉద్యమాన్ని అణచడానికి పోలీసులు లాఠీలకు పని చెప్పారు. పోలీసులు చేసిన పనితో ప్రభుత్వం డిఫెన్స్ లో పడిన వేళ తమ చర్యలను సమర్థించుకోవడానికి ఆర్టీసీ కార్మికులతో పాటు మావోలు ఉన్నారని సిపి అంజన్ కుమార్ వ్యాఖ్యలు చేయడం ఆర్టీసీ కార్మికులకు ఆగ్రహం తెప్పిస్తుంది. కావాలని తమపై దాడి చేసి ఆందోళన చేస్తున్న వారిలో నిషేధిత సంఘాల నేతలు ఉన్నారని చెప్తున్నారని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.