బొల్లారం కెమికల్ ప్లాంట్లో భారీ పేలుడు.. ఎగసిపడుతున్న మంటలు.. చిక్కుకుపోయిన కార్మికులు?
సంగారెడ్డి జిల్లాలోని ఐడీఏ బొల్లారంలో ఉన్న వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం(డిసెంబర్ 12) మధ్యాహ్నం 12.50గం. సమయంలో ఫ్యాక్టరీలో ఒక్కసారిగా రియాక్టర్లు పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. భారీ శబ్దాలతో సంభవించిన పేలుళ్లతో... కార్మికులు భయంతో ఫ్యాక్టరీ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో తొమ్మిది మంది కార్మికులు సొమ్మసిల్లి పడిపోయారు. వీరిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Recommended Video
ప్రాథమిక సమాచారం ప్రకారం... ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 200-300 మంది కార్మికుల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగింది లంచ్ బ్రేక్ సమయంలో కావడంతో ఎక్కువమంది కార్మికులు బయటే ఉన్నట్లు సమాచారం. దీంతో భారీ ప్రమాదం తప్పిందంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుపోయింది. దీంతో స్థానికులెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు.
స్థానిక పోలీసులకు ప్రమాదంపై సమాచారం అందడంతో వెంటనే నాలుగు ఫైరింజన్లను రంగంలోకి దించారు. సుమారు ఐదారు గంటలు శ్రమిస్తే తప్ప మంటలు అదుపులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.లోపల చిక్కుకుపోయిన కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. పేలుడు తీవ్రత ఎక్కువగానే ఉండటంతో నష్టం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే పరిశ్రమ యాజమాన్యం ఈ ప్రమాద ఘటనపై స్పందించలేదు.
ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ... 9 మంది కార్మికులు సొమ్మసిల్లి పడిపోయినట్లు తెలిపారు. ప్రస్తుతం తాను కూడా ప్లాంట్ వద్దకు బయలుదేరానని తెలిపారు.
వింధ్యా ఆర్గానిక్ ఫ్యాక్టరీలో ప్రమాదం గురించి తెలియగానే అందులో పనిచేసే కార్మికుల కుటుంబాలు ఆందోళనకు గురయ్యాయి. కొంతమంది కార్మికుల కుటుంబ సభ్యులు ప్లాంట్ వద్దకు చేరుకుని తమవారు క్షేమంగానే ఉన్నారా లేదా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.ప్రమాద ఘటనపై ఇప్పటివరకూ ఫ్యాక్టరీ యాజమాన్యం స్పందించలేదు.