చదువులో గోల్డ్ మెడల్.. చోరీల్లో నెంబర్ వన్.. 13 ఏళ్లుగా అదే పని
హైదరాబాద్ : చదువులో టాప్ గా నిలిచాడు. ఎంబీఏలో ఏకంగా గోల్డ్ మెడల్ కొట్టేశాడు. మంచిగా ప్రయత్నిస్తే ఉన్నతమైన ఉద్యోగంలో సెటిలయ్యేవాడు. కానీ బుద్ధి వక్రీకరించింది. టెన్ టు సిక్స్ ఉద్యోగం చేయడమేంటి అనుకున్నాడో ఏమో గానీ చోరీల బాట పట్టాడు. విలాసాలకు అలవాటు పడి పెద్ద దొంగలా మారాడు.
కార్లలో తిరుగుతూ రెక్కీ నిర్వహించడం ఇతగాడి మొదటి ప్రాధాన్యం. తాళాలు వేసి ఉన్న ఇళ్లే టార్గెట్ గా చోరీలకు తెగబడతాడు. 13 సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తూ తెలుగు రాష్ట్రాల పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. ఇదివరకు పలుమార్లు చిక్కినా బుద్ధి మాత్రం మారలేదు. జైలు నుంచి బయటకొచ్చాకా.. మళ్లీ చోరీలు చేయడం అలవాటుగా మార్చుకున్నాడు.
రెక్కీ.. పక్కా చోరీ
ప్రకాశం జిల్లా వెటపాలెం ప్రాంతానికి చెందిన మిక్కిలి వంశీకృష్ణ అలియాస్ లోకేశ్ అలియాస్ రిచర్డ్ ఉన్నత విద్య అభ్యసించాడు. చెన్నై తంగవేలు యూనివర్సిటీ నుంచి ఎంబీఏ లో గోల్డ్ మెడల్ సాధించాడు. లగ్జరీ లైఫ్ కు అలవాటుపడ్డ వంశీకృష్ణ 2006 నుంచి చోరీల బాట పట్టాడు. తెలుగు రాష్ట్రాలపై కన్నేసిన ఈ చోరాగ్రేసరుడు.. ముఖ్యంగా హైదరాబాద్ లో దొంగతనాలు చేయడంలో దిట్ట. సంపన్నులు నివసించే కాలనీలు సెలెక్ట్ చేసుకోవడం, కార్లలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేయడం ఇతడికి కొట్టిన పిండి.
దొంగతనాల కేసులో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చాడు. వివిధ సందర్భాల్లో దాదాపు ఐదేళ్లు జైలు జీవితం గడిపాడు. పీడి యాక్ట్ కూడా నమోదైంది. అయినా అతడిలో మార్పు రాలేదు. చోరీల్లో ఆరితేరిన వంశీకృష్ణ.. దాన్నే వృత్తిగా ఎంచుకున్నాడు. 2018 ఆగష్టులో జైలు నుంచి విడుదలైనప్పటి నుంచి మళ్లీ వరుస చోరీలకు పాల్పడ్డాడు.
మోస్ట్ వాంటెడ్
జైలు నుంచి విడుదలైన తర్వాత మరో 10 దొంగతనాలకు పాల్పడి మోస్ట్ వాంటెడ్ గా మారాడు. కొంతకాలంగా బాలానగర్ సీసీఎస్ పోలీసులు వంశీకృష్ణ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చివరకు బుధవారం నాడు పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 800 గ్రాముల బంగారంతో పాటు లక్షన్నర రూపాయల నగదు, ఒక బైక్ స్వాధీనం చేసుకున్నారు.
రియల్ ఎస్టేట్, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. మాటలే పెట్టుబడిగా కోటిన్నర మాయం
ఉన్నత కుటుంబం నుంచి వచ్చి..!
ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిన వంశీకృష్ణ చదువులో రాణించాడు. ఎంబీఏలో గోల్డ్ మెడల్ సాధించాడు. అయితే విలాసాలకు అలవాటుపడి దొంగలా మారాడు. కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ తనదైన ప్రపంచంలో బతుకుతున్నాడు.
చోరీల్లో ఎత్తుకొచ్చిన బంగారాన్ని నగదుగా మార్చుకుంటాడు. గోల్డ్ లోన్స్ ఇచ్చే ప్రైవేట్ సంస్థల్లో వాటిని కుదువ పెట్టి క్యాష్ చేసుకుంటాడు. అనంతరం విహార యాత్రలకు వెళ్లడం, జల్సా చేయడం, స్టార్ హోటళ్లల్లో బస చేయడం అలవాటుగా మార్చుకున్నాడు. హైదరాబాద్ లో చోరీలు చేస్తూ ఇక్కడి పోలీసుల కన్నుగప్పేందుకు బెంగళూరులో నివాసముంటున్నాడు. అక్కడ ఖరీదైన ఫ్లాట్ అద్దెకు తీసుకుని చోరీలకు స్కెచ్ వేస్తున్నాడు.