చదివింది ఎంబీఏ.. చేసేది దొంగతనం.. 35 కేసుల్లో నిందితుడు
హైదరాబాద్ : ఎంబీఏ చదివాడు. మంచి ఉద్యోగం చూసుకుని సెటిలవ్వాల్సింది పోయి చోరీల బాట పట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో ప్రారంభించి కరడుగట్టిన నేరస్థుడిగా తయారయ్యాడు. ఓ ఐదేళ్లు దొంగతనాలు చేసి బిజినెస్ ప్రారంభించాడు. అయితే అందులో నష్టాలు రావడంతో మళ్లీ దొంగలా మారాడు.
హైదరాబాద్ పాతబస్తీలోని సంతోష్ నగర్ కాలనీకి చెందిన మహ్మద్ అవేజ్.. ఎంబీఏ తో పీజీ పూర్తిచేశాడు. ఉద్యోగాలు చూసుకోవాల్సింది పోయి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. 2006 నుంచి 2011 వరకు చోరీలు చేసిన అవేజ్.. 2011లో ఓ కన్సల్టెన్సీ ప్రారంభించాడు. అయితే అందులో నష్టాలు రావడంతో మళ్లీ చోరీల బాట పట్టాడు. సేల్స్ మెన్ అవతారమెత్తి ఆయా కాలనీల్లో రెక్కీ నిర్వహించేవాడు. తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రిపూట దొంగతనాలు చేసేవాడు. ఉప్పల్, కుషాయిగూడ, మల్కాజిగిరి, మేడిపల్లి, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల్లో అవేజ్ చోరీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.
దాదాపు 35 ఇళ్లల్లో చోరీలు చేసినట్లు తెలుస్తోంది. అభియోగాలు రుజువు కావడంతో సైబరాబాద్ మూడో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేగాకుండా అన్నీ కేసులకు కలిపి 28వేల రూపాయల జరిమానా విధించింది. అయితే 2016లోనే రాచకొండ పోలీసులు ఇతడి నుంచి రెండున్నర లక్షల రూపాయల నగదు, 93 తులాల బంగారం, 20 తులాల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అప్పట్లోనే అవేజ్ పై పీడీ చట్టం ప్రయోగించారు.